Tejashwi Yadav: మేం అధికారంలోకి వస్తే..: మోదీ వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్‌

Eenadu icon
By National News Team Published : 24 Oct 2025 11:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్: బిహార్‌లో ఆర్జేడీ ‘జంగల్‌ రాజ్‌’ (ఆటవిక పాలన)పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ స్పందించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే.. అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బిహార్ రాజధాని పట్నాలో మాట్లాడారు (Bihar elections).

‘‘నీతీశ్‌ కుమార్ ప్రభుత్వం పాల్పడిన 55 కుంభకోణాల గురించి ప్రధాని మోదీనే వెల్లడించారు. ఆ అవినీతిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు..? మోసాలు జరుగుతున్నప్పుడు, ఎలాంటి చర్యలు లేనప్పుడు దానిని జంగల్ రాజ్ అంటారు. నేరాల రేటులో భాజపా పాలిత రాష్ట్రాలే ముందువరుసలో ఉన్నాయి. అక్కడ వారు ఏం చేస్తున్నారు..?’’ అని తేజస్వి (Tejashwi Yadav) ప్రశ్నించారు. మహాగఠ్‌బంధన్ ఈ నిరుపయోగమైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కూలదోస్తుందన్నారు. ఒక ఇంజిన్ అవినీతిమయమైందని, మరో ఇంజిన్ నేరపూరితమైందని దుయ్యబట్టారు. 

ఆర్జేడీ తేజస్వి వ్యాఖ్యల వేళ.. భాజపా (BJP) స్పందించింది. ఆయన్ను అవినీతిపరుడని కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ అభివర్ణించారు. ‘‘అవినీతికి పర్యాయపదంగా మారిన వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే షాకింగ్‌గా ఉంది. అపారమైన సంపదను కూడబెట్టుకున్న ఈ కుటుంబం వల్ల బిహార్  వెనక్కి వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యలు చేశారు. యాదవ్ కుటుంబసభ్యులు పలు కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విమర్శలు చేశారు.

దీనికిముందు బిహార్ ప్రజలనుద్దేశించి మోదీ (PM Modi) మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నేతలకు తమలో తాము ఎలా పోట్లాడాలో, స్వప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు. బిహార్‌ను ఆటవిక రాజ్యం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సీఎం నీతీశ్‌కుమార్‌, ఎన్డీయే నేతలు ఎంతో కృషి చేశారు’’ అని ధ్వజమెత్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని