Harish Shankar: రవితేజ చిత్రాన్ని రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌ అంటూ పోస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

హరీశ్‌ శంకర్‌ (Harish Shankar), రవితేజ (Raviteja) కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై హరీశ్‌ స్పష్టతనిచ్చారు.

Updated : 15 Dec 2023 15:09 IST

హైదరాబాద్‌: నటుడు రవితేజ (Ravi Teja), దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో ఇటీవల ఓ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిదే. ఈ నేపథ్యంలోనే త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలా నెట్టింట వైరల్‌గా మారిన ఓ పోస్ట్‌పై హరీశ్‌ శంకర్‌ తాజాగా స్పందించారు. ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్‌ తమ చిత్రాన్ని రిజెక్ట్‌ చేశారంటూ ఆ పోస్ట్‌లో ఉన్న సమాచారం ఏమాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. ఇంతకీ ఆ హీరోయిన్స్‌ ఎవరు? హరీశ్‌ ఏమన్నారంటే..?

‘‘రవితేజ-హరీశ్‌ శంకర్‌ చిత్రాన్ని ఇద్దరు హీరోయిన్స్‌ రిజెక్ట్‌ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం నటి మీనాక్షి చౌదరిని సంప్రదించగా.. డేట్స్‌ విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారు. పారితోషికం కారణంగా నటి ఇలియానా సైతం ఈ చిత్రానికి నో చెప్పారు. దీంతో చిత్రబృందం ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తి డిమ్రి పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.’’ అంటూ గురువారం సాయంత్రం ఓ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

నటుడు ప్రభు కుమార్తెతో యువ దర్శకుడి వివాహం

కాగా, దీనిపై హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ.. ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. శ్రుతి హాసన్‌, లేదా పూజాహెగ్డే.. ఇలా నా ట్రాక్‌ రికార్డ్‌ తెలిసిన వారందరికీ నా ఎంపికపై అపారమైన నమ్మకం ఉంది. ‘యానిమల్‌’ రిలీజ్‌కు ముందే మా సినిమా క్యాస్టింగ్ పూర్తైంది. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చేయకండి. మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను సంప్రదించండి. మెసేజ్‌లకు నేను అందుబాటులోనే ఉంటా’’ అని క్లారిటీ ఇచ్చారు.

హిందీలో విజయవంతమైన ‘రైడ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మాణం జరగనుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని