Indrani Mukerjea: ఓటీటీలోకి వచ్చేసిన షీనా బొరా హత్య కేసు డాక్యుమెంటరీ..

‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 01 Mar 2024 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’. కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సిరీస్ తాజాగా స్ట్రీమింగ్‌ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారమవుతోంది. ఇందులో షానా లెవీ, ఉరాజ్ బహల్‌ కీలక పాత్రలు పోషించారు.

ఏంటీ షీనా బోరా హత్య కేసు..

2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా.. దీన్ని బయటపెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని తెలిపాడు. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచింది. కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అతడి నుంచీ విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది. పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీకుమార్తెల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆర్థిక విభేదాలూ తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

 మెహందీ వేడుకలో ప్రగ్యా జైస్వాల్‌.. నేహాశెట్టి జర్నీ.. రాశీసింగ్‌ స్టిల్స్‌!

మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ భావించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్‌ బెంచ్‌.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని