Navneet Rana: అమరావతి నుంచి సినీ నటి నవనీత్‌ రాణాకు భాజపా టికెట్

అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్‌ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

Published : 28 Mar 2024 00:04 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా భాజపా (BJP) కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచిన కమలం పార్టీ.. పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేసిన భాజపా అధిష్ఠానం.. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) స్థానం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సినీనటి నవనీత్‌ రాణాను బరిలో దించాలని నిర్ణయించింది. ఈమేరకు భాజపా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో తమ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును బుధవారం రాత్రి ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి సీటు నుంచి శివసేన నేత ఆనందరావు అడ్సుల్‌పై నవనీత్‌ రాణా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

అలాగే, కర్ణాటకలోని చిత్రదుర్గ (ఎస్సీ) సీటు నుంచి కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్‌ కర్జోల్‌ను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి ఎ.నారాయణస్వామి గెలుపొందగా.. ఈసారి అభ్యర్థిని మార్పు చేసింది. అలాగే, ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలతో పాటు మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. హరియాణా మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాజీనామాతో కర్నాల్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ కాగా.. అక్కడినుంచి ప్రస్తుత సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీని పోటీలో దించుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని