CM Revanth Reddy: కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని.. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

Updated : 16 Mar 2024 14:20 IST

హైదరాబాద్‌ : ‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని.. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు.

‘‘గత పదేళ్ల పాలనలో వంద సంవత్సరాలకు సరిపడా కేసీఆర్‌ ప్రభుత్వం విధ్వంసం చేసింది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపింది. గతంలో సీఎం దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేది. మా వంద రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం. గత భారాస ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీని అవినీతికి అడ్డాగా మార్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టాం. ఉచిత విద్యుత్‌ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశాం. ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేశాం. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి.. ఆదాయాన్ని స్థిరీకరించాం’’ అని అన్నారు.

ఈ సందర్భంగా కవిత అరెస్టు విషయంపై సీఎం స్పందించారు. ‘‘కవిత అరెస్టును కేసీఆర్‌ ఖండించలేదు. ఆయన మౌనాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఆమె అరెస్టుపై కేసీఆర్‌, నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు. దాని వెనక వ్యూహం ఏంటి? గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు.. కానీ నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు. కేసీఆర్‌ కుటుంబం, భాజపా మద్యం కుంభకోణాన్ని నిరంతర ధారావాహికలా నడిపించారు. ఈ అరెస్ట్‌ భాజపా, భారాస ఆడుతున్న డ్రామా. ఎన్నికల షెడ్యూల్‌కు ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? 12 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. మమ్మల్ని దెబ్బతీసేందుకు భాజపా-భారాస చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ అరెస్టు ఎన్నికల స్టంట్‌. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు’’ అని రేవంత్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని