Sena (UBT): సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్‌ పార్టీ తొలి జాబితా విడుదల

Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

Updated : 27 Mar 2024 10:56 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) దగ్గరపడుతున్న వేళ బరిలోకి దిగే గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీలన్నీ తలమునకలయ్యాయి. మహారాష్ట్ర (Maharashtra) మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు అనంత్‌ గీతే, అరవింద్‌ సావంత్‌కు చోటు దక్కింది. కాగా.. సీట్ల సర్దుబాటుపై విపక్ష కూటమి పార్టీల మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగానే ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం.

రాయ్‌గఢ్‌ స్థానం నుంచి అనంత్‌, దక్షిణ ముంబయి నుంచి సావంత్‌ను ఉద్ధవ్‌ పార్టీ బరిలోకి దించింది. ఇక, పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్‌ దేశాయ్‌ని దక్షిణ మధ్య ముంబయి స్థానంలో నిలబెట్టింది. మరో ఎంపీ గంజనన్‌ కీర్తికర్‌ కుమారుడు అమోల్‌కు తాజా జాబితాలో చోటు దక్కింది. వాయువ్య ముంబయి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

వరుణ్‌గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన అధీర్‌ రంజన్‌

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. 

అయితే, తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, మిగిలిన నాలుగు స్థానాలకు జరుగుతున్న చర్చలపై కాంగ్రెస్‌ పార్టీ అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల వేళ ఉద్ధవ్‌ పార్టీ తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం. మరోవైపు, ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. పవార్‌ పార్టీ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని