AP Cabinet: మంత్రులెవరు.. ఏపీ క్యాబినెట్‌ కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, భాజపా భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపా నుంచి ఎవరెవర్ని ఎంచుకుంటారు.. అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Updated : 06 Jun 2024 10:36 IST

మంత్రివర్గంలో లోకేశ్, పవన్‌ చేరతారా అనేదానిపై చర్చ
 తెదేపాలో ‘క్లీన్‌’ ఇమేజ్‌ ఉన్న ఎమ్మెల్యేలు, బీసీ, యువత, మహిళలకు ప్రాధాన్యమిచ్చే యోచన
 జనసేన, భాజపాల నుంచి ఎవరి ఎంపికనేదీ కీలకమే
 తెదేపా అవకాశాల్ని ప్రభావితం చేయనున్న మిత్రపక్షాల కూర్పు
 12న ప్రమాణస్వీకారం!

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, భాజపా భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపా నుంచి ఎవరెవర్ని ఎంచుకుంటారు.. అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెదేపా అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీపరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైనా చర్చ సాగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి  ఎలాంటి మొహమాటాలకూ పోకుండా ‘క్లీన్‌’ ఇమేజ్‌ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా.. కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీనవర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలోకన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో కడప (మాధవీరెడ్డి), పుట్టపర్తి (సింధూరరెడ్డి), పెనుకొండ (సవిత) లాంటి చోట్ల మొదటిసారి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ (శింగనమల), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), ఎస్టీల నుంచి శిరీషాదేవి (రంపచోడవరం), జగదీశ్వరి (కురుపాం) విజయం సాధించారు. బీసీల నుంచి గళ్లా మాధవి (గుంటూరు పశ్చిమ), యనమల దివ్య (తుని), సవిత (పెనుగొండ) వంటి వారున్నారు. వీరిలో ఒకరిద్దరికి అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది.

వీరంతా యువతరానికి, రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశమివ్వాలనుకుంటే.. ఎస్సీ వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య (నందిగామ), వంగలపూడి అనిత (పాయకరావుపేట) వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు. పార్టీలో అత్యంత సీనియర్‌ నేత అశోకగజపతిరాజు కుమార్తె, విజయనగరం నుంచి గెలుపొందిన అదితి గజపతిరాజు పేరూ పరిశీలనలోకి రావచ్చు.

సీనియర్లలో ఎవరికి చోటు?

తెదేపాలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్‌.వి.ఎస్‌.కె.రంగారావు, కళా వెంకటరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, శ్రీరాం తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేశ్‌ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్‌ పేర్లు పరిశీలించొచ్చు.

ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బి.ఎన్‌.విజయ్‌కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డితోపాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్‌ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పుచేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో తెదేపా చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశమొస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ఛాన్సు దక్కొచ్చు. 

మైనారిటీల నుంచి..

మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల), నసీర్‌ (గుంటూరు తూర్పు), షాజహాన్‌ బాషా (మదనపల్లి) ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే అభ్యర్థులు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి    అవకాశం లభించొచ్చు.

పవన్‌ కల్యాణ్‌ మంత్రివర్గంలో చేరతారా?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీపరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశముంది. జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్ఠంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్‌ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలినవాటికి కాపు, బీసీ, ఎస్సీ/ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో భాజపా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా.. గరిష్ఠంగా ఇద్దరికే చోటు లభించొచ్చు. వీటికి సీనియర్‌ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, భాజపాల నుంచి ఏ జిల్లాలో, ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్నిబట్టి తెదేపా ఎమ్మెల్యేల అవకాశాలూ ప్రభావితమవుతాయి.

మోదీ ప్రమాణస్వీకారం తర్వాతే..

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెదేపా వర్గాల సమాచారం. ఎన్డీయే పక్షాల తరఫున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణస్వీకారం చేయొచ్చని, దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీయేలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాల కథనం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని