Chandrababu: తితిదే జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలి: చంద్రబాబు

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తెదేపా

Updated : 17 Sep 2021 12:34 IST

అమరావతి: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తితిదేకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన తితిదేకు ముందెన్నడూ లేని విధంగా 81మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయమన్నారు. వ్యాపార ధోరణి, రాజకీయ ప్రయోజనాలతో దీన్ని ఏర్పాటు చేశారని చంద్రబాబు ఆరోపించారు. తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అని.. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు. 

భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన తితిదే బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారని.. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలని.. తితిదే సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని