TDP: ఓడిపోయేందుకే వైఎస్‌ జగన్‌ ‘సిద్ధం’: చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు.

Updated : 02 Mar 2024 16:59 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు తెదేపాలో చేరారు. నెల్లూరు పీవీఆర్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా తెదేపా-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

‘‘వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అజాత శత్రువు. ఆయన.. ప్రజా సేవకు మారుపేరు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారు. వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నాం. ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశంతోనే వేమిరెడ్డి పార్టీలోకి వచ్చారు. నెల్లూరు కార్పొరేషన్‌ మొత్తం ఖాళీ అయింది. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నా.

ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్‌ పనిగా పెట్టుకున్నారు. మనమంతా బానిసలం.. ఆయన రారాజు.. అనుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ను వ్యతిరేకించినా.. చేసింది తప్పని చెప్పినా.. ఇక వారి పని అయిపోయినట్లే. అలా ప్రశ్నించినందుకే సొంత పార్టీ నేతలకు సైతం వేధింపులు తప్పలేదు. సీఎం జగన్‌ అవలంబిస్తోన్న తీరును చూస్తే చాలా బాధేస్తోంది. వ్యక్తులు, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పార్టీ తెదేపా. అహంకారంతో ఇష్టానుసారం రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. ఆ బాధ్యత మన అందరిపైనా ఉంది. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు. ఐదు కోట్ల ప్రజానీకం, భావితరాల భవిష్యత్తు కోసం జగన్‌ను గద్దె దించాలి. రాష్ట్రం, ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండేందుకే ఏమాత్రం అర్హత లేదు. ఆయన విధానాలు నచ్చక వాళ్ల నేతలే పార్టీకి బైబై అంటున్నారు. కార్యకర్తలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రికి భంగపాటు తప్పదు. వెయ్యి శాతం చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయేది తెదేపా-జనసేన ప్రభుత్వమే. 

విశాఖలో దోచేసిన వ్యక్తి నెల్లూరుకు..

ఇది ప్రారంభం మాత్రమే. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతోనే ఉద్ధృతమైన తిరుగుబాటు మొదలవుతుంది. వైకాపా నాయకులు రోడ్డుమీద తిరగాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు విశాఖను దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. అక్కడ మొత్తం ఊడ్చేశారు.. ఇప్పుడు నెల్లూరుకు వస్తే ఇక్కడా ఏమీ మిగలదు. తనకు ఎవరూ ఎదురు ఉండొద్దనే నియంతృత్వ ధోరణిలో జగన్‌ ముందుకెళ్తున్నారు. దోచుకున్న డబ్బుతో ఎక్కడ పడితే అక్కడ సిద్ధం.. సిద్ధం.. అని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మొదట్లో సిద్ధం అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచిస్తే... ఓడిపోయేందుకే జగన్‌ ‘సిద్ధం’ అని అంటున్నట్లు అర్థమైంది.

జగన్‌.. హూ కిల్డ్‌ బాబాయ్‌ అని నీ సోదరి అడుగుతోంది..

హూ కిల్డ్‌ బాబాయ్‌.. అని నీ సోదరి అడుగుతోంది జగన్‌.. సమాధానం చెప్పండి. వివేకా హత్య కేసును ఎందుకు తేల్చలేదని సునీత ప్రశ్నించారు. బాబాయ్‌ హత్యపై సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని జగన్‌కు సవాల్‌ విసురుతున్నా. ధైర్యంగా మాట్లాడితే ఆమెపైనా కేసులు పెట్టి వేధిస్తారా? నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎలాంటి నీచానికైనా దిగజారుతారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైకాపాకు నిద్ర పట్టడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడాలనుకుంటే వాళ్లకు బాధేంటో?కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే రకం వాళ్లు. అలా చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చి అందరినీ వేధించారు. తెదేపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. రాజకీయ రౌడీలను నిమిషంలోపే అణచివేసే శక్తి తెదేపాకు ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని