IND vs PAK: సూపర్‌ 4లో ఇండియా- పాకిస్థాన్‌ మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్టే రిఫరీ!

Eenadu icon
By Sports News Team Updated : 20 Sep 2025 16:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌ నేపథ్యంలో సెప్టెంబర్‌ 21న సూపర్‌4లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఐసీసీ (ICC) నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. పైక్రాఫ్ట్‌ గత ఆదివారం గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు పాకిస్థాన్‌ క్రికెటర్లతో మ్యాచ్‌ అనంతరం కరచాలనం చేయడానికి ఆసక్తి చూపలేదు. మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని కూడా టీమ్‌ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav).. పహల్గాం ఉగ్రదాడి బాధితులు, ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న భారత వీర సైనికులకు అంకితమిచ్చాడు. అలాగే టాస్‌ తర్వాత అతడు, పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్ అఘాతో కరచాలనం చేయడానికి విముఖత చూపించాడు. 

ఈ ఘటనపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తన అక్కసు వెల్లగక్కింది. దీనికి మ్యాచ్‌ రిఫరీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుణ్ని చేస్తూ.. ఐసీసీకి రెండు ఫిర్యాదు లేఖలు పంపింది. మొదటి మెయిల్‌లో అతణ్ని రిఫరీగా టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. రెండో లేఖలో పైక్రాఫ్ట్‌ను కనీసం పాక్‌ మ్యాచ్‌లకైనా దూరం పెట్టాలని అభ్యర్థించింది. అయితే పాక్‌ ఫిర్యాదులను ఐసీసీ బుట్టదాఖలు చేసింది. కరచాలన వివాదంలో రిఫరీ పాత్ర లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. 

అలాగే ఇటీవల జరిగిన పాకిస్థాన్‌, యూఈఏ మ్యాచ్‌కు కూడా అతణ్నే రిఫరీగా నియమించింది. దీంతో టోర్నీని బహిష్కరించాలని చూసిన పాకిస్థాన్‌ చివరకు యూఈఏతో మ్యాచ్‌ను ఆడింది. కానీ ఆ జట్టు సమయానికి మైదానానికి చేరుకోలేదు. దీంతో షెడ్యూలు కన్నా గంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా.. సూపర్‌ 4లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు కూడా తిరిగి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా నియమిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయం! తన తటస్థ వైఖరికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సూపర్‌ 4లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ రేగుతోంది. ఆ రోజు ఏం జరుగబోతోందో..! పాకిస్థాన్‌ ఆటగాళ్లు.. మళ్లీ ఏమైనా పిల్లచేష్టలకు దిగుతారా? అని క్రికెట్‌ పండితులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags :
Published : 20 Sep 2025 16:36 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు