MS Dhoni: ‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడు’

తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్‌ వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి. 

Published : 21 May 2024 00:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇటీవల ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ఫలితంగా సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే ధోనీకి చివరిదని, మహీని మళ్లీ మైదానంలో చూడలేమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో వార్త బయటికొచ్చింది. తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్‌ వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ధోనీ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాడని పేర్కొన్నాయి. 

‘‘ఐపీఎల్ సమయంలో ధోనీ తొడ కండర గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఈ గాయానికి శస్త్రచికిత్స కోసం అతడు లండన్ వెళ్లొచ్చు. ధోనీ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. కానీ, క్రికెట్ ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడు. శస్త్రచికిత్స తర్వాతే అతడు తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు. చికిత్స తీసుకుని కోలుకోవడానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది’’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి.

ఈ ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు నుంచే ధోనీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. జట్టు రెండో వికెట్‌ కీపర్‌ అయిన డేవిడ్‌ కాన్వే కూడా గాయం బారిన పడటంతో.. తప్పనిసరి స్థితిలో మహీనే బాధను ఓర్చుకొని మైదానంలోకి దిగాడు. ఓ పక్క గాయానికి  మందులు వాడుతూనే.. వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకొంటూ ఆడాడు.  వాస్తవానికి డాక్టర్లు అతడిని విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ, జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ధోనీనే నిలబడాల్సి వచ్చింది. గత ఐపీఎల్‌లో కెప్టెన్‌ కూల్‌ మోకాలి గాయంతోనే ఆడి.. జట్టుకు కప్పు అందించాడు. ప్రస్తుతం అది పూర్తిగా నయమైంది. కానీ, కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని