Mohsin Naqvi - BCCI: నఖ్వీకి క్రీడలపై ఉన్న పరిజ్ఞానం సున్నా: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మదన్‌ లాల్‌

Eenadu icon
By Sports News Team Updated : 01 Oct 2025 18:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ మదన్‌ లాల్.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ చీఫ్‌, పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీపై విరుచుకుపడ్డారు. అతడికి అసలు క్రీడా పరిజ్ఞానమే లేదని చురకలంటించాడు. టీమ్ఇండియా ఆసియా కప్ (Asia Cup) గెలిచిన అనంతరం, ట్రోఫీ, మెడల్స్‌ను తనతోపాటు తీసుకెళ్లిన నఖ్వీ క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. అయితే నఖ్వీవి పిల్లచేష్టలని మదన్‌లాల్ దుయ్యబట్టాడు. అతడికి క్రీడలపై ఉన్న పరిజ్ఞానం సున్నా.. అని తీవ్రంగా విమర్శించాడు. అతడు భారత్‌తో పంతానికి పోయి తనతోపాటు, అతడి దేశ పరువును కూడా పోగొట్టాడన్నాడు. 

‘విజేతగా నిలిచిన జట్టు సభ్యులు ట్రోఫీతో ప్రేక్షకులు, అభిమానుల ముందు సంబరాలు చేసుకుంటే బాగుంటుంది. నఖ్వీకి అసలు క్రీడా పరిజ్ఞానమే లేదు. ఎలా హుందాగా వ్యవహరించాలో కూడా తెలియదు. అతడు ట్రోఫీని టీమ్ఇండియాకు అందించమని వేదిక మీద ఉన్న ఇతర వ్యక్తులకు చెబితే బాగుండేది. కానీ నఖ్వీ దుందుడుకు చర్యతో తన, అతడి దేశ పరువునూ పోగొట్టాడు’ అని మదన్‌లాల్ అన్నాడు. 

‘ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ కార్యాలయానికి వెళ్లి ట్రోఫీని సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) ఎందుకు తీసుకోవాలి? టీమ్ఇండియా టోర్నీలో గెలిచింది. వారు మైదానంలోనే ప్రేక్షకుల మధ్య వేడుకలు చేసుకోవడానికి అర్హులు. నిజానికి నఖ్వీకి ఏ మాత్రం పరిజ్ఞానం లేదు. అయినా.. వాళ్ల దేశానికి సంబంధించి ప్రతి నిర్ణయాన్ని సైనిక దళాలే తీసుకుంటాయి కదా’ అని మదన్‌లాల్ చురకలంటించాడు. 

అయితే నఖ్వీకి సొంత దేశపు మాజీల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆసియాకప్‌లో నఖ్వీ తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదని షాహిద్‌ అఫ్రిది విమర్శించాడు. పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి అతడు తక్షణమే తప్పుకోవాలనీ సూచించాడు. 

Tags :
Published : 01 Oct 2025 18:49 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు