Bengaluru X Hyderabad: 277 పోయె.. 287 వచ్చె!
2024 మార్చి 27.. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనుకున్న తేదీ. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ రోజు ముంబయి బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి, పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్.
మళ్లీ రెచ్చిపోయిన సన్రైజర్స్
ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డు బద్దలు
హెడ్ విధ్వంసక శతకం
కార్తీక్ చెలరేగినా.. ఆర్సీబీకి ఓటమే
బెంగళూరు
2024 మార్చి 27.. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనుకున్న తేదీ. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ రోజు ముంబయి బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి, పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్.. కొత్త రికార్డును 20 రోజులైనా నిలవనీయలేదు. ఈసారి హైదరాబాదుడుకు బలైన జట్టు.. బెంగళూరు. సన్రైజర్స్ బ్యాటర్ల సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దయిన స్టేడియం.. చిన్నస్వామి. ఆర్సీబీ బౌలింగ్ను ట్రావిస్ హెడ్ ఊచకోత కోస్తే.. మిగతా బ్యాటర్లూ సిక్సర్ల ముచ్చట తీర్చుకున్నారు. తర్వాత బెంగళూరు బ్యాటర్లేమీ తక్కువ తినలేదు. డుప్లెసిస్, కోహ్లి అదిరే ఆరంభాన్నిస్తే.. దినేశ్ కార్తీక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యం 288 పరుగులైనా 25 పరుగుల తేడాతోనే ఓడింది ఆర్సీబీ.
పతాక స్థాయి విధ్వంసంతో రికార్డులకు పాతరేయడమే పనిగా పెట్టుకున్న సన్రైజర్స్.. గత నెల తనే నెలకొల్పిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో మ్యాచ్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9×4, 8×6) విధ్వంసక శతకం సాధిస్తే.. క్లాసెన్ (67; 31 బంతుల్లో 2×4, 7×6), సమద్ (37 నాటౌట్; 10 బంతుల్లో 4×4, 3×6), అభిషేక్ శర్మ (34; 22 బంతుల్లో 2×4, 2×6) మార్క్రమ్ (32 నాటౌట్; 17 బంతుల్లో 2×4, 2×6) కూడా రెచ్చిపోయారు. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62; 28 బంతుల్లో 7×4, 4×6), కోహ్లి (42; 20 బంతుల్లో 6×4, 2×6) ఆర్సీబీకి మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత ఆ జట్టు గాడి తప్పింది. దినేశ్ కార్తీక్ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు. కమిన్స్ (3/43), మార్కండే (2/46) ఆ జట్టును దెబ్బ తీశారు.
ఇంకాస్త పోరాడుంటే..: 288 పరుగుల లక్ష్యం.. తొలి ఓవర్ నుంచే దాదాపు 14.5 రన్రేట్తో పరుగులు చేయాలి. విజయం గురించి ఆలోచించలేని పరిస్థితి. కానీ పోరాడితే పోయేదేముంది అన్నట్లు ఆర్సీబీ బ్యాటర్లు తెగించే ఆడారు. కోహ్లి, డుప్లెసిస్ పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పవర్ప్లేలో ఆర్సీబీ దూసుకెళ్లింది. భువనేశ్వర్ బౌలింగ్లో లెగ్ ఫ్లిక్తో కొట్టిన సిక్సర్ సహా ఉన్నంతసేపు కళ్లు చెదిరే షాట్లు ఆడాడు కోహ్లి. అయితే పవర్ప్లే ముగిసిందో లేదో అతడి మెరుపులకు తెరపడింది. ఇంపాక్ట్ ప్లేయర్ మయాంక్ మార్కండే.. కోహ్లిని బౌల్డ్ చేశాడు. తొలి వికెట్ పడగానే ఇన్నింగ్స్కు కుదుపులకు లోనైంది. విల్ జాక్స్ (7) దురదృష్టవశాత్తూ రనౌటైతే.. రజత్ పటిదార్ (9), సౌరభ్ చౌహాన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరో ఎండ్లో డుప్లెసిస్ వీరోచిత బ్యాటింగ్ కొనసాగడంతో ఆర్సీబీ 7.5 ఓవర్లకే 100 దాటేసింది. 23 బంతుల్లోనే డుప్లెసిస్ అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే ఫాఫ్ను పదో ఓవర్లో కమిన్స్ పెవిలియన్ చేర్చడంతో ఆర్సీబీ భారీ తేడాతో ఓడుతుందనిపించింది. కానీ కార్తీక్ ఇక్కడ్నుంచి అనూహ్యంగా చెలరేగిపోయాడు. అసాధారణ షాట్లతో సన్రైజర్స్ బౌలర్ల గణాంకాలన్నీ చెల్లాచెదురయ్యేలా చేశాడు. లొమ్రార్ (19), అనుజ్ రావత్ (25 నాటౌట్) అతడికి సహకరించారు. కార్తీక్ ధాటికి బెంగళూరు 12.4 ఓవర్లలోనే 150, 16.1 ఓవర్లకే 200 చేరుకుని సన్రైజర్స్కు దీటుగా నిలిచింది. 3 ఓవర్లలో 72 పరుగులు చేయాల్సి రావడంతో కార్తీక్ ఏమైనా అద్భుతం చేస్తాడా అనిపించింది. కానీ తర్వాతి 2 ఓవర్లలో 37 పరుగులే వచ్చాయి. కార్తీక్ కూడా ఔటైపోయాడు. ఆర్సీబీ ఓటమి ఖాయమైపోయాక చివరి ఓవర్లో (భువనేశ్వర్) రావత్ 4 ఫోర్లు కొట్టాడు. తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత.. ఇన్నింగ్స్ మధ్యలో ఆర్సీబీ ఇంకాస్త పోరాడుంటే.. రికార్డు స్కోరును ఛేదించి సంచలనం రేపేదేమో!
హెడ్ మొదలుపెడితే..: మొదట టాస్ ఓడినపుడు చిన్నస్వామి స్టేడియంలో పిచ్ను చూసి ఇక్కడ 240 స్కోరు చేస్తేనే గెలుస్తామని చెప్పాడు సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్. అప్పటికి ఆ మాట అతిశయోక్తిలా అనిపించింది కానీ.. సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే ఆ జట్టు నిజంగా ఆ మార్కును అందుకుంటుందనిపించింది. ఇన్నింగ్స్ ముందుకు సాగేకొద్దీ ఈ సీజన్లో హైదరాబాద్ బద్దలుకొట్టిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డు నిలిచే అవకాశం లేదని స్పష్టమైపోయింది. ధారాళంగా పరుగులిచ్చే సిరాజ్ను తప్పించినా.. వరుసగా విఫలమవుతున్న ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ స్థానంలో న్యూజిలాండ్ ఫాస్ట్బౌలర్ ఫెర్గూసన్ను జట్టులోకి తెచ్చినా బెంగళూరు బౌలింగ్ అవస్థల్లో ఏ మార్పూ లేదు. జీవం లేని పిచ్, బంతి రయ్యిన దూసుకెళ్తున్న ఔట్ఫీల్డ్.. అన్నింటికీ మించి పసలేని ఆర్సీబీ బౌలింగ్ను పూర్తిగా ఉపయోగించుకుంటూ సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అయితే.. బంతి మీద దీర్ఘ కాల పగ ఉన్నట్లుగా పదే పదే దాన్ని బౌండరీ అవతలకి పంపించేశాడు. హెడ్ బ్యాట్లో స్ప్రింగ్లేమైనా ఉన్నాయా అన్నట్లుగా బంతి తాకడం ఆలస్యం.. రయ్యిమని బౌండరీ బాట పట్టింది. విరామం లేని విధ్వంసంతో హెడ్ చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వర్షంలో ముంచెత్తాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు. పవర్ప్లే ముగిసేసరికే వికెట్ నష్టపోకుండా సన్రైజర్స్ 76 పరుగులు చేసింది. 9వ ఓవర్లో (టాప్లీ) అభిషేక్ ఔటయ్యేసరికే స్కోరు 108. తొలి వికెట్ తీసినందుకు ఆర్సీబీ సంతోషించడానికి ఏమీ లేకపోయింది. ఓ ఎండ్లో పూనకం వచ్చినట్లు హెడ్ విరుచుకుపడుతుంటే.. మూడో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చిన క్లాసెన్ సైతం తనదైన శైలిలో విధ్వంసానికి దిగాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో అతను కొట్టిన ఓ సిక్సర్ ఏకంగా 106 మీటర్లు ప్రయాణించింది. 12వ ఓవర్లోనే హైదరాబాద్ 150 మార్కును అందుకోగా.. హెడ్ కూడా సెంచరీ (39 బంతుల్లో) పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్లో హెడ్ ఔటైనా.. పరుగుల జోరేమీ తగ్గలేదు. క్లాసెన్ టాప్ గేర్ అందుకోవడంతో 15వ ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. మరో ఎండ్లో మార్క్రమ్ ఓ మోస్తరు వేగంతో ఆడాడు. 23 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న క్లాసెన్.. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. అయితే 17వ చివరి బంతికి అతను ఔటైపోయాడు. అప్పటికి స్కోరు 231. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన సమద్.. బాదుడును మరో స్థాయికి తీసుకెళ్లాడు. టాప్లీ వేసిన 19వ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 6, 4 కొట్టడంతో ఒక ఓవర్ మిగిలుండగా సన్రైజర్స్ 266/3తో రికార్డు స్కోరుకు చేరువైంది. వైశాఖ్ వేసిన చివరి ఓవర్లోనూ 21 పరుగులు వచ్చాయి.
హెడ్ పిడుగల్లే..
2021 ఐపీఎల్ సీజన్ వరకూ సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనింగ్తో ఇబ్బంది లేదు. అప్పుడు వార్నర్, బెయిర్స్టో ఓపెనర్లుగా జట్టుకు ధనాధన్ ఆరంభాలను ఇచ్చేవాళ్లు. కానీ 2022 నుంచి కథ మారింది. వార్నర్ను వదిలేసుకోవడంతో సరైన ఓపెనింగ్ కూర్పు సమస్యగా మారింది. మార్క్రమ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్, హ్యారీ బ్రూక్ ఇలా వేర్వేరు జోడీలను ప్రయత్నించింది. కానీ అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇన్నింగ్స్ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై పిడుగల్లే పడేందుకు ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ముంబయితో పోరుతో ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున తొలి మ్యాచ్ ఆడిన హెడ్.. 24 బంతుల్లోనే 62 పరుగులతో అదరగొట్టాడు. జట్టు రికార్డు స్కోరు 277/3 చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత వరుసగా 19, 31, 21 పరుగులు సాధించాడు. ఇప్పుడేమో ఆర్సీబీతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లోనే శతకం చేసి.. ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఐపీఎల్లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు బలమైన పునాది వేస్తూ భారీ స్కోర్లు చేయడంలో హెడ్ ఇప్పుడు కీలకంగా మారాడు. ఐపీఎల్లోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన రికార్డునే సన్రైజర్స్ బద్దలుకొట్టిందంటే ప్రధాన కారణం హెడ్ సెంచరీ. ఇతనిదే జోరు కొనసాగిస్తే సన్రైజర్స్కు తిరుగుండదు.
హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాఖ్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్ట్రాలు 15
మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287;
వికెట్ల పతనం: 1-108, 2-165, 3-231;
బౌలింగ్: విల్ జాక్స్ 3-0-32-0; టాప్లీ 4-0-68-1; యశ్ దయాళ్ 4-0-51-0; ఫెర్గూసన్ 4-0-52-2; వైశాఖ్ 4-0-64-0; లొమ్రార్ 1-0-18-0
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటీదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరభ్ చౌహాన్ ఎల్బీ (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; లొమ్రార్ (బి) కమిన్స్ 19; అనుజ్ నాటౌట్ 25; విజయ్కుమార్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262;
వికెట్ల పతనం: 1-80, 2-100, 3-111, 4-121, 5-122, 6-181, 7-244;
బౌలింగ్: అభిషేక్శర్మ 1-0-10-0; భువనేశ్వర్ 4-0-60-0; షాబాజ్ అహ్మద్ 1-0-18-0; నటరాజన్ 4-0-47-1; కమిన్స్ 4-0-43-3; మార్కండే 4-0-46-2; జైదేవ్ ఉనద్కత్ 2-0-37-0
4
సన్రైజర్స్ ఇన్నింగ్స్లో 50కి పైగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు. ఐపీఎల్లోనే కాదు పురుషుల టీ20లోనే ఇలా జరగడం ఇదే తొలిసారి. టాప్లీ 68, యశ్ దయాల్ 51, ఫెర్గూసన్ 52, వైశాఖ్ 64 పరుగుల చొప్పున ఇచ్చుకున్నారు. ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న ఆర్సీబీ బౌలర్గా టాప్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
22
సన్రైజర్స్ ఇన్నింగ్స్లో నమోదైన సిక్సర్లు. ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డులో ఆర్సీబీ (21)ని సన్రైజర్స్ దాటేసింది.
38
ఈ మ్యాచ్లో సిక్సర్లు. ప్రపంచ టీ20ల్లో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గత రికార్డు 37.
549
రెండు ఇన్నింగ్స్లు కలిపి ఈ మ్యాచ్లో నమోదైన పరుగులు. ఓ టీ20 మ్యాచ్లో సాధించిన పరుగుల పరంగా ఇదే ప్రపంచ రికార్డు. ఈ సీజన్లో సన్రైజర్స్, ముంబయి మ్యాచ్లో 523 పరుగులు వచ్చాయి.
39
శతకానికి హెడ్ ఆడిన బంతులు. ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున ఇదే వేగవంతమైన సెంచరీ. వార్నర్ (2017లో కేకేఆర్పై 43 బంతుల్లో) రికార్డును హెడ్ తిరగరాశాడు. ఐపీఎల్లో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ.
287/3
బెంగళూరుపై సన్రైజర్స్ స్కోరు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు ఇదే. ఈ సీజన్లో ముంబయిపై 277 (3 వికెట్లకు) పరుగులు చేసిన సన్రైజర్స్ ఇప్పుడా రికార్డును మెరుగుపర్చుకుంది. ప్రపంచ టీ20ల్లో నేపాల్దే (మంగోలియాపై 314/3) రికార్డు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు