IND vs PAK: పాక్‌ జట్టు వివాదాల మీద కాకుండా ఆటపై దృష్టి పెట్టాలి: కపిల్ దేవ్‌

Eenadu icon
By Sports News Team Published : 18 Sep 2025 16:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia Cup) భాగంగా సెప్టెంబ్‌ 14న టీమ్ఇండియా (Team India), పాకిస్థాన్‌ తలపడ్డాయి. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్లు, పాకిస్థాన్‌ క్రికెటర్లకు కరచాలనం ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) తెలిపాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు దీనిపై అనవసర రాద్ధాంతం చేసింది. ఈ ఘటనకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్‌ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్‌ చేసింది. లేదంటే టోర్నీనే బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. బుధవారం యూఏఈతో జరగాల్సిన మ్యాచ్‌కు కూడా పాక్‌ సరైన సమయానికి మైదానానికి చేరుకోలేదు. దీంతో గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్‌ జట్టు వివాదాల మీద కాకుండా, తమ ఆటతీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) వారికి హితవు పలికారు. 

‘ఇవన్నీ చాలా చిన్న విషయాలు. పాకిస్థాన్‌ జట్టు తమ ఆటమీద దృష్టి పెట్టాలి. కరచాలనం ఇవ్వాలా.. వద్దా అనేది పర్సనల్‌ ఛాయిస్‌. కరచాలనం చేయాలా.. ఆలింగనం చేసుకోవాలా.. అనేది అవతల వారి ఇష్టం. ఒక వేళ కరచాలనం చేయకుంటే.. దాన్ని భూతద్దంలో చూస్తూ.. పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. దీని మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. పాకిస్థాన్ సరైన క్రికెట్‌ ఆడటం లేదు. ముందు వారు తమ ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి’ అని కపిల్‌ దేవ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్‌ 4కు చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ మరోసారి సెప్టెంబర్‌ 21న టీమ్ఇండియాతో తలపడనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని