Mohammed Shami: నా రిటైర్‌మెంట్‌ ఎప్పుడనేది వారి చేతుల్లో లేదు: షమీ

Eenadu icon
By Sports News Team Published : 28 Aug 2025 09:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత లిస్ట్‌లో వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. రెండేళ్ల కిందట చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన షమీ.. అప్పటినుంచి జట్టులో స్థానం దక్కించుకోలేదు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డే, ఇంగ్లాండ్‌పై టీ20 మ్యాచ్ ఆడిన షమీ.. గాయాలతో కుస్తీ పడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2027 టోర్నీలో ఆడటమే లక్ష్య్ంగా ముందుకుసాగుతున్నాడు. ఈక్రమంలో తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న కథనాలను కొట్టిపడేశాడు. ఎవరి చేతుల్లోనూ వీడ్కోలు నిర్ణయం లేదని.. ఆటపై విసుగు వచ్చేవరకూ కొనసాగుతానని స్పష్టం చేశాడు.

‘‘ఎవరికైనా సమస్య ఉంటే.. నేను రిటైర్‌మెంట్‌ తీసుకుంటే వారి జీవితాలు బాగుంటాయని నాతోనే చెప్పండి. అప్పుడు ఆలోచిద్దాం. నేను ఆటకు వీడ్కోలు పలకాలని కోరుకొనేంతగా ఎవరికైనా సమస్యగా మారానా చెప్పండి. నేను ఎప్పుడైతే ఆటపై విసుగు చెందుతానో.. అప్పుడు వదిలేస్తా. అంతేకానీ, మీరు (విమర్శకులు) నిర్ణయం తీసుకోవద్దు. నేను ఇప్పటికీ కష్టపడుతున్నా. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక చేయకపోతే.. దేశవాళీలో ఆడతా. ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగానే ఉంటా. మీకు బోర్‌ కొట్టినప్పుడల్లా ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. నాకు అంత సమయం లేదు’’ అని వ్యాఖ్యానించాడు.

ఇప్పుడు చాలా బాగున్నా..

‘‘గత రెండు నెలల్లో నా ఫిట్‌నెస్‌ చాలా మెరుగుపర్చుకున్నా. నా నైపుణ్యాలకూ పదునుపెట్టా. బరువును అదుపులోకి తెచ్చుకున్నా. సుదీర్ఘంగా స్పెల్స్‌ వేయడం పైనే దృష్టిపెడుతున్నా. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు. ఇందుకోసం బ్యాటింగ్, ఫీల్డింగ్‌ విషయంలోనూ కఠినంగా ప్రాక్టీస్ చేశా. ఇప్పుడైతే ప్రతిదాంట్లో కంఫర్ట్‌గా ఉన్నా. నాకు ఇప్పటికీ వన్డే వరల్డ్‌ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలనేది కల. ఆ జట్టులో సభ్యుడిగా ఉండాలని ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరాం. వరుసగా విజయాలు సాధించి అక్కడికి వెళ్లాం. అయితే, అక్కడ కాస్త ఆందోళన పడ్డాం. అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఫైనల్‌లోకి అడుగుపెట్టాం. కానీ, ఆ రోజు మాకు కాస్త అదృష్టం కలిసి వచ్చిఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఛాంపియన్‌గా నిలిచేవాళ్లం’’ అని షమీ గుర్తు చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు