Pakistan cricket: పాక్‌ బ్యాటర్లు సిక్సర్లు కొట్టలేకపోతున్నారని రంగంలోకి సైన్యం..!

పాకిస్థాన్‌ క్రికెటర్లు సిక్సర్లు కొట్టలేకపోతున్నారట.. వారికి అందుకే కఠిన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా సైన్యం రంగంలోకి దిగుతోంది.

Published : 06 Mar 2024 12:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ (Pakistan) క్రికెటర్లు భారీ సిక్సర్లు కొట్టలేకపోతున్నారని పీసీబీ ఛైర్మన్‌ మొహసీన్‌ నక్వీకు చిరాకేసింది. అసలు తాను మ్యాచ్‌ చూస్తుండగా ఒక్కరు కూడా బంతిని స్టాండ్స్‌లోకి పంపించలేకపోయారని నేరుగా ఎద్దేవా చేశారు. దీంతో వారికి సైన్యంతో శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తమ క్రికెటర్లు ఓ సైనిక క్యాంప్‌లో సాధన చేస్తారని తెలిపారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కొందరు క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్‌ఎల్‌ టోర్నమెంట్‌ పూర్తికాగానే దాదాపు 10 రోజులపాటు ఇది జరుగుతుందని చెప్పారు. 

‘‘నేను లాహోర్‌ మ్యాచ్‌లను వీక్షిస్తుండగా.. ఒక్కరు కూడా బంతిని స్టాండ్స్‌లోకి తరలించలేకపోయారు. ఎప్పుడైనా ఆ స్థాయి సిక్సర్లు కనిపిస్తే.. కచ్చితంగా విదేశీయులే వాటిని బాదారనుకొంటాను. అందుకే ప్రతి ఆటగాడి ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చేందుకు బోర్డు ఓ ప్లాన్‌ సిద్ధం చేయాలని కోరుతున్నాను. మీరు దాని ప్రకారం శ్రమించండి. న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, టీ20 ప్రపంచకప్‌ సిరీసులు వరుసగా ఉన్నాయి. దీనిని చూసి.. ఎప్పుడు సాధన చేయాలని ఆశ్చర్యపోతుంటాను. ఈ మధ్యలో చిన్న విరామం ఉన్నట్లు గుర్తించాము. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8 వరకు మేము కాకుల్‌ (మిలటరీ అకాడమీ)లో క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణలో పాక్‌ సైన్యం భాగస్వామి అవుతుంది. వారు కచ్చితంగా మీకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని క్రికెటర్లు ఉద్దేశించి నక్వీ వ్యాఖ్యానించారు. 

క్రికెటర్లు కచ్చితంగా దేశం కోసం జాతీయ జట్టుకు ఆడేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నక్వీ హితవు పలికారు. ఇటీవల స్టార్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ సెంట్రల్‌ కాంట్రాక్టును బోర్డు తొలగించింది. అతడు జూన్‌ 30 వరకు విదేశాల్లో టీ20 లీగులు ఆడకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

ఇషాన్‌, శ్రేయస్‌ వివాదం వేళ.. ‘రంజీ’లపై సచిన్‌ పోస్ట్‌ వైరల్‌

పాకిస్థాన్‌ జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజ్లర్లు కనిపిస్తున్నారని మాజీ పేసర్‌ ఆఖిబ్‌ జావెద్‌ మూడేళ్ల క్రితమే ఎద్దేవా చేశాడు. అప్పట్లో వారి ఆట తీరు దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని