Rahul Tripathi: నాకు అవకాశం వచ్చే వరకూ.. అలా ఆలోచిస్తూనే ఉన్నా: రాహుల్ త్రిపాఠి

చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడేందుక సిద్ధమవుతోంది. 

Published : 26 May 2024 13:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అవకాశం కోసం వేచి చూడటం చాలా కష్టంగా అనిపించిందని హైదరాబాద్‌ ఆటగాడు  రాహుల్ త్రిపాఠి వ్యాఖ్యానించాడు. ప్లేఆఫ్స్‌ మ్యాచుల్లో కీలకంగా రాణిస్తున్న అతడి నుంచి ఫైనల్‌లోనూ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 156 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 152.94. ఇందులో 17 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. తుది జట్టులో లేకపోయినప్పుడు కూడా.. తన అవసరం ఉన్నప్పుడు సిద్ధంగా ఉండేవాడినని తెలిపాడు. 

‘‘ఈ సీజన్‌లో నా అవకాశం కోసం వేచి చూసి ఉన్నా. అది చాలా క్లిష్టసమయం. నేను ఆడనప్పుడు కూడా.. జట్టుకు ఎలా సాయపడాలని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎప్పుడు ఛాన్స్‌ వస్తే అప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. అందుకు తీవ్రంగా శ్రమించేవాడిని. అదే నన్ను ఈ సీజన్‌లో ముందుండి నడిపిస్తోంది. స్థానం లేకపోయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. అలానే ఉంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే నా అభిప్రాయం’’ అని త్రిపాఠి తెలిపాడు. 

కమిన్స్‌కు రూ. 20 కోట్లు ఛార్జ్‌ వేసిన శ్రేయస్

ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా కోల్‌కతా - హైదరాబాద్‌ కెప్టెన్లు శ్రేయస్‌ అయ్యర్, పాట్ కమిన్స్ సరదాగా చెన్నై అంతా కలియదిరిగారు. వీరిద్దరూ కలిసి ఆటో రైడ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ సీట్‌లో కూర్చున్న శ్రేయస్‌ ఆటో ఛార్జ్‌గా కమిన్స్‌కు రూ. 20 కోట్లు వేశాడు. ఎందుకంటే సన్‌రైజర్స్‌ కమిన్స్‌ను అంత పెట్టి కొనుగోలు చేసింది మరి. 

ధోనీ సరసన కమిన్స్‌ చేరే అవకాశం

వన్డే ప్రపంచ కప్‌తోపాటు ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచిన కెప్టెన్ల జాబితాలోకి చేరేందుకు పాట్ కమిన్స్ ఎదురు చూస్తున్నాడు. ఇంతటి ఘనత సాధించిన కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ. అతడి నాయకత్వంలో భారత్ 2011 వరల్డ్‌ కప్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కమిన్స్‌ కూడా గతేడాది ఆసీస్‌కు వన్డే కప్‌ అందించాడు. ఈసారి హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని