Ashwin- WTC Final: నాకు ముందే తెలుసు.. జట్టు అలా ఉండాలనేది మేనేజ్‌మెంట్ నిర్ణయం: అశ్విన్

వరుసగా రెండోసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) ఓడిన భారత్‌.. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. జట్టు ఎంపికపైనే తొలి విమర్శ రాగా, స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనా ఉంది. తాజాగా అశ్విన్‌ (Ashwin) ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించాడు.

Updated : 16 Jun 2023 10:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో  సీనియర్‌ స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించకుండా భారత్‌ పక్కన పెట్టేసింది. టెస్టు ఫైనల్‌కు టీమ్‌ఇండియా రావడంలో అశ్విన్‌దే కీలక పాత్ర. అలాంటి అతడిని కాదని ఏకైక స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా వైపు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతోనే అశ్విన్‌కు చోటు దక్కలేదు. ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి ‘గద’ను సొంతం చేసుకుంది. అశ్విన్‌ను తీసుకోకపోవడంపై విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌పై స్పందించాడు. తనకు మ్యాచ్‌కు ముందే ఈ విషయం తెలుసని చెప్పాడు. జట్టులో ఉంటే బాగుండేదని, అయితే భారత్‌ ఓడిపోవడం మాత్రం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు. 

‘‘ఎందుకు పక్కన పెట్టారు..? అనేది చాలా కఠినమైన ప్రశ్న. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి భారత్‌ అడుగు పెట్టడం అద్భుతం. అయితే, నేను ఫైనల్‌లో ఆడి ఉంటే ఇంకా బాగుండేది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ నేను నాలుగు వికెట్లు తీశా. బౌలింగ్‌ ఉత్తమంగానే వేశా. అయితే, ఈసారి కూడా భారత్‌ ఓడిపోవడం బాధ కలిగించింది. 2018 -19 సీజన్‌ నుంచి విదేశాల్లోనూ ఎక్కువగానే వికెట్లు తీశా. జట్టు విజయాల్లోనూ కీలక పాత్రే పోషించా. టెస్టుల్లో ఎప్పుడైనా సరే నాలుగో ఇన్నింగ్స్‌ చాలా కీలకం. స్పిన్నర్‌ను తట్టుకోవడం కష్టం. కానీ, ఓవల్‌ మైదానంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. దీంతో ఏకైక స్పిన్నర్‌గా జడ్డూను తీసుకోవాల్సి వచ్చింది.

బయటి నుంచి వచ్చే విమర్శలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నాకు నేనే విమర్శకుడిని. వారు నన్ను జడ్జ్‌ చేయడం మూర్ఖత్వం అవుతుంది. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారనే దానిపై ఆలోచించేంత స్టేజ్‌లో నా కెరీర్‌ లేదు. నా సత్త ఏంటా నాకు తెలుసు. సరిగ్గా ప్రదర్శన లేకపోతే.. తొలి విమర్శకుడిని నేనే. దానిపై నేను తీవ్రంగా కృషి చేసి మెరుగుపర్చుకుంటా. అంతేకానీ, ఎవరు నన్ను జడ్జ్‌ చేస్తున్నారనేది నాకు అనవసరం’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు