SA vs IND: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. ఇషాన్‌ కిషన్‌ దూరమైంది అందుకేనా..?

డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌ (SA vs IND) ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుసగా మూడోసారి భారత్‌ చేరుకోవాలంటే ఈ సిరీస్‌ కీలకం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. 

Updated : 23 Dec 2023 16:23 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు (SA vs IND) ముగ్గురు భారత ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. రుతురాజ్‌ గైక్వాడ్, మహమ్మద్‌ షమీ, ఇషాన్‌ కిషన్‌ టెస్టు సిరీస్‌ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్‌, షమీ గాయాల కారణంగా దూరమైతే.. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండబోనని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతడికి విశ్రాంతినిచ్చారు. అయితే, కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్ల ప్రకారం ఇషాన్‌ కిషన్‌ మానసికంగా ఇబ్బంది పడటం వల్లే విరామం తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. వాటిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వరుసగా మ్యాచ్‌ల కోసం ప్రయాణించడం వల్ల అతడు మానసిక అలసటకు గురైనట్లు సమాచారం.

‘‘మానసికంగా చాలా అలసిపోయినట్లు ఇషాన్‌ కిషన్‌ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. క్రికెట్‌ నుంచి కాస్త విరామం కావాలని కోరాడు. టెస్టు సిరీస్‌ నుంచి తప్పించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అందుకు, మేనేజ్‌మెంట్ అనుమతినిచ్చింది’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది భారత్‌ ఆడిన ప్రతి సిరీస్‌లోనూ ఇషాన్‌ జట్టుతోనే ఉన్నాడు. ఎక్కువసార్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. వరల్డ్‌ కప్‌లోనూ తొలి రెండు మ్యాచుల్లో ఆడిన ఇషాన్‌ .. ఆ తర్వాత డగౌట్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడి స్థానంలో కేఎస్ భరత్‌కు అవకాశం దక్కింది. రుతురాజ్‌ స్థానంలో  అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది. మరోవైపు విరాట్ కోహ్లీ అత్యవసరంగా స్వదేశానికి తిరిగొచ్చాడు. అయితే, మొదటి టెస్టు ప్రారంభం నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్‌ 26న తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

టెస్టు జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్), కేఎస్‌ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్‌ సిరాజ్, ముకేశ్‌ కుమార్‌, బుమ్రా (వైస్‌ కెప్టెన్), ప్రసిధ్‌ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని