IND vs PAK: విరాట్ కోహ్లీ, రోహిత్ బౌల్డ్‌.. ఎవరి వికెట్‌ను ఎంజాయ్‌ చేశానంటే?: షహీన్‌

ఆసియా కప్‌లో పాక్‌తో (IND vs PAK) మ్యాచ్‌ రద్దు కావడంతో భారత్‌ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడిస్తే నేరుగా సూపర్ -4కి (Asia Cup 2023) చేరుతుంది. మరోవైపు టీమ్‌ఇండియాను (Team India) కట్టడి చేయడంలో పాక్‌ పేసర్ షహీన్‌ కీలక పాత్ర పోషించాడు.

Published : 03 Sep 2023 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్ సగం జోష్ మాత్రమే అందించింది. కేవలం ఒక్క ఇన్నింగ్స్‌ ఆట మాత్రమే సాగడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. భారత బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రమే వచ్చింది. పాక్‌ పేసర్లు విజృంభించడంతో పది వికెట్లూ వారికే దక్కాయి. మరీ ముఖ్యంగా పాక్‌ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది తన గేమ్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి చూపించాడు. కీలకమైన వికెట్లను తీసి భారత్‌ను ఒత్తిడికి గురి చేశాడు. అలాగే సెకండ్‌ స్పెల్‌లోనూ మరోసారి వికెట్లను పడగొట్టాడు. దీంతో 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ రోహిత్ శర్మతోపాటు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీని బౌల్డ్ చేశాడు. అలాగే స్లో బంతితో హార్దిక్‌ పాండ్యను బోల్తా కొట్టించాడు. మరో ఆఫ్‌సైడ్ షార్ప్‌ బాల్‌ వేసి జడేజాను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, తాను మాత్రం రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేసినట్లు షహీన్ చెప్పాడు. 

ఊరించి.. ఉసూరుమనిపించి.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్‌ రద్దు

‘‘కొత్త బంతితో త్వరగా వికెట్లు తీయాలనేది మా గేమ్ ప్లాన్‌. భారత్‌తో మ్యాచ్‌లో ఇదే జరిగింది. విరాట్, రోహిత్ శర్మ వికెట్లు చాలా కీలకం. అయితే, అన్ని వికెట్లు ఒకటే కానీ, వారిద్దరిని బౌల్డ్‌ చేయడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్‌ తీయడం మరింత ఎంజాయ్ చేశా. పేసర్లుగా మేం అనుకున్న విధంగానే ఫలితం రాబట్టగలిగాం. నసీమ్ షా 150 కి.మీ వేగంతో బంతులను సంధిస్తున్నాడు. కొత్త బంతితో స్వింగ్‌ వస్తుండటంతో పరుగులు చేయడం కష్టమే. అయితే, ఛేదనలో కాస్త నిలదొక్కుకుని బంతి పాతబడే వరకు వేచి చూస్తే పరుగులు చేయొచ్చు. కానీ, వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోవడం కాస్త నిరాశకు గురి చేసింది’’ అని షహీన్‌ తెలిపాడు. 

ఆసియా కప్‌లో తొలిసారి ఇలా..

ఆసియా కప్‌లో తొలిసారి ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లూ తీసిన జట్టుగా పాకిస్థాన్‌ అవతరించింది. ఈ మ్యాచ్‌లో షహీన్ 4, రవూఫ్‌ 3, నసీమ్‌ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 9 వికెట్లు తీసిన రికార్డు కూడా పాక్‌ పేరిటే ఉంది. 2004 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై షమి, షోయబ్‌ అక్తర్, షబ్బిర్ అహ్మద్‌ మూడేసి వికెట్లు తీశారు. భారత పేసర్లు కూడా శ్రీలంకపై 1984లో ఎనిమిది వికెట్లు తీశారు. ఇందులో చేతన్ శర్మ, మదన్‌లాల్ మూడేసి వికెట్లు తీయగా.. మనోజ్ ప్రభాకర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని