IND vs PAK: ఊరించి.. ఉసూరుమనిపించి.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్‌ రద్దు

ఆసియా కప్‌ 2023లో భారత్, పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరుదేశాల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

Updated : 03 Sep 2023 09:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ అంటే క్రికెటర్లకు ఎంత టెన్షన్‌ ఉంటుందో.. క్రికెట్ అభిమానుల్లోనూ తీవ్ర ఆసక్తి ఉండటం సహజమే. ప్రత్యర్థి జట్టుపై తమ దేశం ఆటగాళ్లు ఆధిపత్యం చలాయించి విజయం సాధించాలని ఇరుజట్ల అభిమానులు కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఫలితం ఎటూ తేలకుండాపోయి అభిమానులకు నిరాశే మిగులుతుంది. తాజాగా ఆసియా కప్‌ 2023 టోర్నీలోనూ ఇలానే జరిగింది. శ్రీలంక వేదికగా దాయాదుల మధ్య పోరు వర్షం కారణంగా రద్దు అయింది. రెండుసార్లు వర్షం అంతరాయాల నడుమ టీమ్‌ఇండియా 48.5 ఓవర్లకు 266 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురవడంతో మ్యాచ్‌ను పాక్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం కాకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దాయాదుల మధ్య వరుణుడు అడ్డుపడి ఇలా మ్యాచ్ రద్దు కావడం ఆసియా కప్‌లో రెండోసారి. మొత్తంగా మూడో మ్యాచ్‌ కావడం గమనార్హం. ఇలా ఊరించి.. అభిమానులను ఉసూరుమనిపించిన మ్యాచ్‌లూ ఉన్నాయి. 

ఆసియా కప్‌లో అప్పుడు అలా.. 

 ఈ మ్యాచ్‌ ముందు వరకు ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య వన్డే ఫార్మాట్‌లో 17 మ్యాచ్‌లు జరిగాయి, అందులో 1997 ఆసియా కప్‌లో మినహా మిగతావన్నీ ఫలితాలు వచ్చినవే. ఇది కూడా శ్రీలంక వేదికగా జరిగిన మ్యాచ్ కావడం విశేషం. తొలుత జులై 20న భారత్ - పాక్‌ మ్యాచ్ ప్రారంభమైంది. పాక్‌ బ్యాటింగ్‌ చేస్తూ 9 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ మరుసటి రోజుకు వాయిదాపడింది. అయితే, అప్పుడు కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆ మ్యాచ్‌లో వెంకటేశ్ ప్రసాద్ (4/17), అబే కురువిల్లా (1/10) ధాటికి సయీద్ అన్వర్ (0), ఇంజమామ్‌ ఉల్‌ హక్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. 

అక్కడ ఒకే ఒక్క మ్యాచ్‌ వర్షార్పణం..

ప్రస్తుత భారత కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా పాక్‌తో ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌ ఆడేందుకు స్కాట్లాండ్‌కు వెళ్లింది. గ్లాస్గో వేదికగా మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తీరా, ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడం ఫ్యాన్స్‌ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పాకిస్థాన్‌ కెప్టెన్‌గా షోయబ్‌ మాలిక్‌ వ్యవహరించాడు. 

  • కెనడా వేదికగా 1997లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ కూడా వర్షార్పణమైంది. పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 31.5 ఓవర్ల సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ రద్దు అయిపోయింది. అప్పటికి పాక్‌ స్కోరు 169/3.
  • 1989 సీజన్‌లో పాక్‌ పర్యటనకు భారత్‌ వెళ్లింది. మూడో వన్డే కూడా ఇలాగే ప్రారంభమైన కాసేపటికే వర్షం కారణం అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పాక్‌ 14.3 ఓవర్లు ఆడి 28/3 స్కోరుతో ఉన్నప్పుడు మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. 
  • మోహిందర్ అమర్‌నాథ్ నాయకత్వంలోని భారత్‌ 1984లో పాక్‌కు వెళ్లింది. రెండో వన్డేలో భారత్‌ 40 ఓవర్లలో (కుదించిన ఓవర్లు) 210/3 స్కోరు చేసింది. అనంతరం పాక్ ఛేదనకు దిగాల్సి ఉంది. అయితే, వర్షం రావడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని