Women's World Cup: ఆ కోటను బద్దలు కొట్టేదెలా?

Eenadu icon
By Sports News Desk Published : 28 Oct 2025 03:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఈనాడు క్రీడావిభాగం

అమ్మో ఆస్ట్రేలియా.. మహిళల ప్రపంచకప్‌ ఆరంభమవుతుండగా కంగారూ జట్టు గురించి అందరూ భయపడ్డారిలా! టోర్నీ మొదలయ్యాక.. ఇలా భయపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదన్నట్లే సాగింది ఆ జట్టు ఆట. గ్రూప్‌ దశలో ఆ జట్టుకు ఓటమన్నదే లేదు. ఒక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా.. మిగతా ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. టోర్నీలో అందరి కంటే ముందుగా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్నది ఆస్ట్రేలియానే. మొత్తంగా 13 పాయింట్లతో లీగ్‌ దశలో అగ్రస్థానం సాధించారు కంగారూ అమ్మాయిలు. అలాంటి జట్టు సెమీస్‌లో భారత్‌కు ఎదురవుతోంది. విజయం ఆషామాషీ విషయం కాదని వేరే చెప్పాలా?

ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తిరుగులేని బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఆసీస్‌.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా తడబడ్డ ఆ జట్టు 76/6కు చేరుకుంది. ఆసీస్‌ స్కోరు 150కి మించదని అంచనా. కానీ చివరికి 221/9తో ఇన్నింగ్స్‌ను ముగించింది. తర్వాత పాక్‌ను 114 పరుగులకే కుప్పకూల్చి 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఒక దశలో 128/5కు పరిమితమై కూడా 326 పరుగులు చేసి, ఘనవిజయం సాధించడం.. మరో పోరులో 350 దాటేలా కనిపించిన భారత్‌ను 330కి కట్టడి చేసి, అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్‌లో రికార్డు నెలకొల్పడం.. ఇంగ్లాండ్‌తో 249 పరుగుల ఛేదనలో 68కే 4 వికెట్లు కోల్పోయి కూడా, తర్వాత మరో వికెట్‌ కోల్పోకుండా 40.3 ఓవర్లలోనే విజయాన్నందుకోవడం ఆసీస్‌కే చెల్లింది. 

ఎంత మెరుగైన జట్టుకైనా కొన్ని మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి విజయాలు సాధించడమే ఛాంపియన్‌ జట్టు లక్షణం. ఆస్ట్రేలియా అమ్మాయిలు ఈ ప్రపంచకప్‌లో అదే చేస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు అనుకున్న ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై ఆ జట్టు అలవోకగా నెగ్గింది. భారత్‌తో పోరులో కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకుంది. మొత్తంగా ఒక ఛాంపియన్‌ జట్టు ఎలా ఆడాలో అలా ఆడుతోంది ఆసీస్‌. ఏ ఒక్కరి మీదో ఆధారపడకపోవడం.. మ్యాచ్‌ విన్నర్లుగా నిలవడానికి జట్టు సభ్యులు పోటీ పడుతుండడం ఆ జట్టు విశిష్టతను తెలియజేస్తుంది. భారత్‌పై అలీసా హీలీ గెలిపిస్తే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బెత్‌ మూనీ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడింది. ఆష్లీ గార్డ్‌నర్‌ రెండు శతకాలతో జట్టుకు విజయాలను అందించింది. ఆమె బంతితోనూ రాణిస్తోంది. సదర్లాండ్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులతో అదరగొడుతోంది. ఎలీస్‌ పెర్రీ ఒకప్పటి స్థాయిలో మెరవకపోయినా.. భారత్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. బౌలింగ్‌లో మెగాన్‌ షట్, అలానా కింగ్, సోఫీ మోలనూ సత్తా చాటుతున్నారు. ఇలా ఆసీస్‌కు ఏ రకంగానూ ఇబ్బంది లేదు.

వీళ్ల మీదే భారం: అత్యంత సవాలుతో కూడిన మ్యాచ్‌లో భారత్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రధానంగా ఓపెనర్‌ స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ల మీదే ఉంది. వీరికి అపార అనుభవం ఉంది. ఆస్ట్రేలియాపై మంచి రికార్డూ ఉంది. స్మృతి ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉంది. గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాపై 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. ఇక హర్మన్‌ ఇటీవలి ఫామ్‌ బాలేకున్నా.. కీలక పోరులో ఆమె జోరందుకుంటుందని జట్టు ఆశిస్తోంది. 2017 సెమీస్‌ ఇన్నింగ్స్‌ను గుర్తు తెచ్చుకుని మరోసారి ఆమె చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. సెమీస్‌ ముంగిట ఫామ్‌లో ఉన్న ప్రతీక గాయంతో జట్టుకు దూరం కావడం మాత్రం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. ఆమె ఆసీస్‌పై గ్రూప్‌ దశలో 75 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. 

న్యూజిలాండ్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన జెమీమాపై ఆశలున్నాయి. రిచా ఘోష్, దీప్తి శర్మ సైతం సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌లో ఆసీస్‌కు పోటీ ఇచ్చినా.. బౌలింగ్‌లో మాత్రం భారత్‌ బలహీనమే. అయితే సెమీస్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో ఆ ఆయుధంతోనే భారత్‌ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాల్సి ఉంది. ఫామ్‌లో ఉన్న దీప్తి, శ్రీచరణిలకు తోడు బంగ్లాతో నామమాత్రపు మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన రాధ యాదవ్‌ మాయాజాలం చేయగలిగితే.. బ్యాటర్లు పట్టుదలతో నిలిస్తే భారత్‌కు అవకాశాలుంటాయి. ప్రస్తుత ఫామ్‌లో ఆసీస్‌ను ఓడించడం తేలిక కాదు. కానీ ఇటీవల గెలుపోటములతో సంబంధం లేకుండా కంగారూలపై ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న భారత్‌.. అదే శైలిలో ఆడి అద్భుత విజయాన్నందుకుంటుందేమో చూడాలి.


2017 మళ్లీ చూస్తామా?

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ పోరు అనగానే ఎక్కువమందికి గుర్తుకొచ్చేది  2017 సెమీస్‌. ఇంకో కప్పు ఖాయమని ధీమాగా ఉన్న కంగారూలకు ఆ మ్యాచ్‌లో భారత్‌ మామూలు షాక్‌ ఇవ్వలేదు. మహిళల క్రికెట్‌ చరిత్రలోనే ఒకానొక అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అనదగ్గ భారీ శతకం (171 నాటౌట్‌)తో హర్మన్‌ప్రీత్‌.. ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించింది. 282 లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు.. 245 పరుగులకు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే తరహాలో ఆస్ట్రేలియాకు షాక్‌ ఇస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ కంగారూ జట్టు అప్పుటికంటే చాలా బలంగా కనిపిస్తోంది. ఫామ్‌ ఇంకా గొప్పగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు