Dhruv Jurel: ‘మరో ధోనీ కనిపిస్తున్నాడు’.. ధ్రువ్‌ జురెల్‌పై గావస్కర్‌ ప్రశంసలు

Dhruv Jurel: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య కొనసాగుతున్న నాలుగో టెస్ట్‌లో వికెట్‌కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ నేపథ్యంలో అతనిపై సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

Published : 25 Feb 2024 14:10 IST

రాంచీ: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) 90 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనిపై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) ప్రశంసల వర్షం కురిపించాడు. లెజెండరీ క్రికెటర్‌ ధోనీతో పోల్చాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు.

‘‘ధ్రువ్‌ జురెల్‌ ఏకాగ్రత చూస్తుంటే నాకు మరో ఎం.ఎస్‌.ధోనీ తయారవుతున్నాడనిపిస్తోంది. ఈరోజు అతడికి శతకం చేజారి ఉండొచ్చు. కానీ, ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడు’’ అని కామెంటరీలో భాగంగా గావస్కర్‌ విశ్లేషించాడు. నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ధ్రువ్‌ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు కుల్దీప్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అతడు మరో 60 పరుగులు జోడించాడు.

మధ్యాహ్న భోజన విరామానికి ముందు టామ్‌ హార్ట్‌లీ వేసిన బంతికి ధ్రువ్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 149 బంతుల్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. దీంతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్దీప్‌, జురెల్‌ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. కుల్దీప్‌ మరోసారి 131 బంతుల్లో రెండు ఫోర్లతో కలిపి 28 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

మొత్తానికి నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 307 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్‌ 90, యశస్వి జైస్వాల్‌ 73, శుభ్‌మన్‌ గిల్‌ 38, కుల్దీప్‌ యాదవ్‌ 28 మాత్రమే రాణించారు. ఇంగ్లాండ్‌ జట్టులో యువ బౌలర్‌ బషీర్‌ ఐదు వికెట్లతో విజృంభించాడు. హార్ట్‌లీ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని