IND vs USA: ఇండియా Vs మినీ ఇండియా... గెలిస్తే సూపర్‌-8కు..!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 12న భారత్‌, అమెరికా (IND vs USA) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. 

Published : 11 Jun 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆతిథ్య హోదాలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న పసికూన అమెరికా జట్టుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మహా అయితే ఆ జట్టు లీగ్ దశలో ఒక మ్యాచ్‌ గెలుస్తుందని భావించారు. కానీ, అమెరికా జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సూపర్‌-8లో రేసులో ముందుంది. మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన అమెరికా ఇప్పుడు టీమ్‌ఇండియాతో మ్యాచ్‌కు సై అంటోంది. బుధవారం న్యూయార్క్‌ వేదికగా భారత్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌ను సూపర్ ఓవర్‌లో ఓడించి మంచి ఊపు మీదున్న యూఎస్ఏ.. భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అమెరికా జట్టులో భారతి సంతతి ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ కాస్త ఇండియా వర్సెస్‌ మినీ ఇండియాగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు హ్యాట్రిక్‌ సాధించడంతోపాటు సూపర్‌-8 బెర్తును ఖాయం చేసుకుంటుంది. 

వీళ్లతో ముప్పు.. అమెరికాకు అది ప్లస్‌ పాయింట్! 

పేరుకు అమెరికా జట్టే అయినా అందులో చాలామంది  భారత సంతతి ఆటగాళ్లే. వారే ఇప్పుడు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత సంతతి ఆటగాళ్లయిన కెప్టెన్‌ మోనాంక్ పటేల్‌తోపాటు బౌలర్లు సౌరభ్‌ నేత్రావాల్కర్‌, హర్మిత్‌సింగ్, జస్‌దీప్ సింగ్, నితీశ్‌కుమార్‌తో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారత్‌కు షాక్‌ తప్పదు! పాకిస్థాన్‌పై మోనాంక్‌ పటేల్‌ అర్ధ శతకం బాదాడు. ఇక ఆ జట్టులోని ఆరోన్ జోన్స్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కెనడాపై 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ ఆంద్రీస్ గౌస్ ఇదే మ్యాచ్‌లో అర్ధశతకం బాదాడు. పాక్‌తో మ్యాచ్‌లోనూ వీరిద్దరూ రాణించారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి భారత్ ప్రణాళికలు రచించాలి. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం అమెరికా బ్యాటర్లకు ఉంది. అందుకే వారు ఈజీగా రన్స్‌ చేస్తున్నారు. ఆ పిచ్‌లపై ఇతర జట్ల ఆటగాళ్లు మాత్రం బాగా పరుగులు రాబట్టడానికి కష్టపడుతున్నారు. అమెరికా స్పిన్నర్‌ నోస్తుష్ కెంజిగేతో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. పాక్‌పై అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. 

ఆ ఇద్దరూ ఫామ్‌ అందుకోవాలి 

ఐర్లాండ్‌పై సునాయసంగా నెగ్గిన రోహిత్ సేన.. పాకిస్థాన్‌తో జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో నిరాశపర్చినా.. బౌలర్లు అదరగొట్టడంతో 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది టీమ్‌ఇండియా. ఈ విజయంతో టీమ్ఇండియాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. న్యూయార్క్‌లో రెండు మ్యాచ్‌లు ఆడటంతో అక్కడి పరిస్థితులపై మన జట్టుకు అవగాహన ఏర్పడింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబె ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత్‌ సూపర్‌-8 చేరడం దాదాపు ఖాయమవడంతో వీరిద్దరూ ఫామ్‌ను అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్య, బుమ్రా కీలకం కానున్నారు. అలసత్వం లేకుండా సమష్టిగా రాణిస్తే అమెరికాపై భారత్‌ విజయం నల్లేరు మీద నడకే. మరో విషయం ఏంటంటే భారత్, అమెరికా మధ్య జరుగుతున్న మొదటి క్రికెట్ మ్యాచ్‌ ఇదే. 

తుది జట్లు అంచనా

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్. 

అమెరికా: స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), ఆంద్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్‌ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్‌దీప్‌ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని