WTC Final: ‘వివాదాస్పద ఔట్‌’పై ట్వీట్‌.. శుభ్‌మన్‌ గిల్‌కు భారీ జరిమానా

WTC Finalలో రోహిత్‌ సేనకు భారీ జరిమానా పడింది. వివాదాస్పద ఔట్‌ కారణంగా టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు అదనంగా మరింత జరిమానా విధించారు.

Updated : 12 Jun 2023 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) పోరులో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమ్‌ఇండియా (Team India)కు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ (ICC) భారీ జరిమానా విధించింది. రోహిత్‌ సేన మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అటు టైటిల్‌ గెలిచిన ఆస్ట్రేలియా (Australia)కూ జరిమానా తప్పలేదు. స్లో ఓవర్‌ రేట్‌ (Slow Over Rate) కారణంగా ఆసీస్‌ జట్టుకు వారి మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో భారత్‌ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేశాయని ఐసీసీ తెలిపింది.

గిల్‌కు 115శాతం జరిమానా..

ఇక, టీమిండియా ఓపెనర్‌ శుభమన్ గిల్‌ (Shubman Gill)కు అదనపు జరిమానా పడింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ ఔట్‌ అయిన తర్వాత అంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు గానూ మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. అంటే.. మొత్తంగా గిల్‌కు 115శాతం జరిమానా పడింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతిని స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. అయితే, ఈ క్యాచ్‌ వివాదస్పదంగా మారింది. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్‌ అందుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడంతో గిల్ (Shubman Gill) పెవిలియన్‌కు చేరక తప్పలేదు. దీనిపై గిల్‌ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా? అనే అర్థం వచ్చేలా ఎమోజీలు పోస్ట్‌ చేశాడు. 

దీంతో ఐసీసీ (ICC) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గిల్‌కు అదనపు జరిమానా విధించారు. ‘‘గిల్‌ ఔట్‌ విషయంలో టెలివిజన్‌ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైందే. ఆ తర్వాత రోజు గిల్‌ ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఐసీసీ ఆర్టికల్‌ 2.7 (అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిన ఘటనపై బహిరంగ విమర్శలు, అనుచిత వ్యాఖ్యల) నిబంధన కింద అతడు చేసింది తప్పిదమే’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 469 భారీ ఆధిక్యం సమర్పించుకున్న టీమ్‌ఇండియా 296కే చతికిలపడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 270 పరుగులు చేయగా.. రోహిత్‌ సేన 234 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని