IND vs ENG: యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ.. ఇంగ్లాండ్ టార్గెట్‌ 557

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. పర్యటక జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 18 Feb 2024 15:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి (214*: 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్విశతకం బాదేశాడు. అతడితోపాటు శుభ్‌మన్ గిల్ (91), సర్ఫరాజ్‌ ఖాన్ (68*) హాఫ్‌ సెంచరీలు చేశారు. దీంతో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఇంగ్లాండ్‌ ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే ఆలౌటైంది. భారత్‌కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.

గిల్‌ రనౌట్‌.. సెంచరీ మిస్‌

ఓవర్‌నైట్‌ 196/2 స్కోరుతో నాలుగో రోజును ప్రారంభించిన భారత్‌ దాదాపు గంటపాటు వికెట్ కోల్పోలేదు. కానీ, కుల్‌దీప్‌తో (27)  సమన్వయలోపం కారణంగా శుభ్‌మన్‌ గిల్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌ ప్రకటించిన యశస్వి మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగానే ఆడాడు. అయితే, మరికాసేపటికే నిలకడగా ఆడిన కుల్‌దీప్‌ ఔటయ్యాడు. దాదాపు 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండటం విశేషం. 258/4 స్కోరుతో ఉన్న సమయంలో యశస్వికి తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ జతకలిశాడు. ఇంగ్లాండ్‌కు ‘బజ్‌బాల్‌’ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు. కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్‌కు 172 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ, సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లాండ్‌ ఎదుట లక్ష్యం 550+ దాటడంతో భారత సారథి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినట్లు ప్రకటించాడు. 

మరిన్ని విశేషాలు.. 

  • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసీస్‌ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (855) ఉన్నాడు. 
  • భారత్‌ ప్రతి ఇన్నింగ్స్‌లోనూ 400+ స్కోరు చేయడం ఇది మూడోసారి. 2005లో పాక్‌పై (407, 407/9), 2009లో శ్రీలంకపై (426, 412/4) సాధించింది. 
  • ఒక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి జట్టుగా తన రికార్డునే భారత్‌ అధిగమించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 48 సిక్స్‌లను భారత్ కొట్టింది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 47 సిక్స్‌లు బాదారు. 
  • భారత్‌ తరఫున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.  ఇంతకుముందు గంగూలీ (535) పేరిట ఉన్న రికార్డును యశస్వి (545) అధిగమించాడు. 
  • ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా వసీమ్‌ అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో.. ఒకే ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టిన ఐదో భారత బ్యాటర్‌ యశస్వి. అతడి కంటే ముందు ధోనీ, హార్దిక్‌, రోహిత్, ఉమేశ్‌ ఉన్నారు.
  •  రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. వరుసగా రెండు ద్విశతకాల బాదిన మూడో టీమ్‌ఇండియా క్రికెటర్‌గానూ నిలిచాడు. వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లీ అతడి కంటే ముందున్నారు.
  •  అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్. దిలావర్‌ హుస్సేన్, సునీల్ గావస్కర్, శ్రేయస్‌ అయ్యర్ ఈ ఘనత సాధించారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని