పెండింగ్‌ బిల్లులకు రూ.1,032 కోట్ల విడుదల

Eenadu icon
By Telangana News Desk Updated : 01 Nov 2025 04:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఉద్యోగుల బిల్లులకే ప్రత్యేకంగా రూ.712 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులకు రూ.1,032 కోట్లను శుక్రవారం ఆర్థిక శాఖ ఒకేసారి విడుదల చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులకు దశల వారీగా ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేయాలనే ప్రతిపాదనలకు గత జూన్‌లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అక్టోబరుకు సంబంధించి ఉద్యోగుల బకాయిల కింద రూ.712 కోట్లు శుక్రవారం విడుదల చేసింది. ఉద్యోగుల వైద్య ఖర్చులు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బిల్లులు ఇందులో ఉన్నాయి. ఇంకా ఉద్యోగుల బిల్లులు రూ.7 వేల కోట్లకు పైగా పెండింగులో ఉన్నట్లు అంచనా.

గతంలో పూర్తి చేసిన పనుల పెండింగు బిల్లుల్లో రూ.10 లక్షలలోపు విలువైన వాటిని పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖలకు సంబంధించి 46,956 బిల్లులకు రూ.320 కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువైన బిల్లులకు రూ.95 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన బిల్లులకు రూ.225 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెద్దసంఖ్యలో బిల్లులు పెండింగులో ఉన్నాయని, వాటికి దశలవారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు భట్టి వివరించారు.

Tags :
Published : 01 Nov 2025 04:13 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు