పకడ్బందీగా కొత్త విత్తన చట్టం ముసాయిదా: మంత్రి తుమ్మల

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 04:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త విత్తన చట్టం-2025 ముసాయిదాను రైతులకు అన్నివిధాలుగా న్యాయం జరిగేలా పకడ్బందీగా రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలన్నారు. ఆదివారం సచివాలయంలో కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన కమిటీతో తుమ్మల సమావేశమయ్యారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, ముసాయిదా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నాణ్యమైన విత్తనోత్పత్తికి కంపెనీలను ప్రోత్సహించేలా, మోసం చేసే వాటి పట్ల కఠినంగా వ్యవహరించేలా ముసాయిదా రూపొందించాలి. అది న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండాలి. కొత్త విత్తన చట్టం రూపకల్పన అనంతరం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపుతాం’ అని తుమ్మల పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘విత్తన రైతులకు రుణ సౌకర్యం, సాంకేతిక శిక్షణ వంటి అంశాలను జోడించాలి. విత్తనోత్పత్తి సంఘాల ఏర్పాటు, లైసెన్సు కలిగిన సంస్థలకే విక్రయ అనుమతివ్వాలి. రైతు, ఆర్గనైజర్, కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉండాలి’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు