Telangana News: డబ్బులూ రద్దవుతున్నాయ్‌

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 05:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము
ధరణి నుంచి భూ భారతి వరకు ఇదే పరిస్థితి.. 
సర్కారు ఖజానాలో దాదాపు రూ.150 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు ‘మీ సేవ’ ద్వారా రూ.66 వేలు చలానా రూపంలో చెల్లించారు. అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీ స్లాట్‌ను రద్దు చేసుకున్నారు. అయితే, నెలలు గడుస్తున్నా ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు. ఇది ఈ ఒక్క రైతు సమస్యే కాదు. 2020లో ధరణి పోర్టల్‌ ప్రారంభం నుంచి నేటి భూ భారతి వరకూ రద్దు చేసుకున్న లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు. ‘లావాదేవీ రద్దు చేసుకున్నాం.. మా డబ్బులు మాకు ఇవ్వండి సార్‌..’ అంటూ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ దాకా తిరుగుతున్నా.. దీనిపై ఎవరికీ అవగాహన లేదని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

ఎవరూ పట్టించుకోవడం లేదు

రిజిస్ట్రేషన్‌- మ్యుటేషన్, గిఫ్ట్‌ డీడ్, వారసత్వ బదిలీ, జీపీఏ, భాగ పంపిణీ తదితర సేవలను పొందుతున్న తరుణంలో వాటికి సంబంధించిన స్లాట్‌ రద్దు చేసుకుంటే రైతులు చెల్లించిన ఛార్జీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖలో అలా వెనక్కి ఇస్తున్నారు. ధరణి నుంచి భూభారతి వరకు మాత్రం ‘రద్దు డబ్బు’ను వెనక్కి ఇవ్వడం లేదు. ఈ తరహా చెల్లింపులకు ప్రత్యేక విధానం లేదని, తమకు రాష్ట్ర స్థాయి నుంచి మార్గదర్శకాలేవీ లేవని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. 

  • 2020 నవంబరు నుంచి ఇప్పటివరకు రూ.150 కోట్లు ‘రద్దు డబ్బులు’ పోగుపడ్డాయి. 
  • 2023లో ఒకదఫా సొమ్ము ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది. ఆ తర్వాత కలెక్టర్ల పేరుతో పోర్టల్‌కు సంబంధించిన ప్రత్యేక ఖాతా పద్దులేక చెల్లింపులు సాధ్యం కావడం లేదని గుర్తించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాల కోసం రెవెన్యూశాఖ దస్త్రాలు సిద్ధం చేసినా తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్లలేదు. 
  • 2014-16 మధ్యకాలంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ జీవో-59 కింద దరఖాస్తు చేసుకుని చలానా రూపంలో సొమ్ము చెల్లించారు. వారిలో చివరిదశలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన 3,140 మందికి రూ.63 కోట్ల వరకు వెనక్కి ఇవ్వాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని