భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు

అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

Published : 28 Apr 2024 03:55 IST

ఇప్పటికే రిసీవర్‌ ఆస్తుల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించారు
73 ఏళ్లనాటి నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ కేసును పరిష్కరిస్తూ హైకోర్టు సంచలన తీర్పు
కలకత్తా హైకోర్టు తరువాత తెలంగాణ హైకోర్టులో 73 ఏళ్ల కేసు పరిష్కారం

ఈనాడు, హైదరాబాద్‌: అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 72 ఏళ్లుగా దేశంలోనే అత్యంత పాత కేసుల్లో ఒకటైన బెర్హంపూర్‌ బ్యాంకు కేసును కలకత్తా హైకోర్టు గత ఏడాది పరిష్కరించగా, 73 ఏళ్ల పాత కేసును తెలంగాణ హైకోర్టు తాజాగా పరిష్కరించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ వారసుల మధ్య వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

ఇదీ వివాదం

నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌కు చెందిన వారసత్వ భూమి పంపిణీ వివాదంలో 1951లో హైకోర్టులో మూడు రాజీ పిటిషన్‌ల ద్వారా ప్రాథమిక డిక్రీ జారీ అయింది. దాని ప్రకారం ఐదు భాగాలుగా ఐదుగురికి నగరంలో ఉన్న 9 ఆస్తుల పంపిణీ జరగాలి. అవి ఎర్రమంజిల్‌, ఎర్రగడ్డ, బొల్లారం, బల్దా, బెహ్లూల్‌ఖాన్‌గూడ, యూసఫ్‌గూడ, మూసాపేటలలో ఉన్నాయి. ఆ భూముల పరిరక్షణతోపాటు విక్రయించి వాటాలను పంచడానికిగాను ఇప్పటిదాకా 9 మంది రిసీవర్లు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఒక్కో ఆస్తిని పంచే క్రమంలో తిరిగి వివాదాలు, కేసులు నడుస్తూ వస్తున్నాయి. కొంత ఆస్తిని వారసులకు భాగ పంపిణీ చేశారు కూడా. ప్రభుత్వం కూడా కొంత భూమిని సేకరించి పరిహారాన్ని ఇవ్వగా దానిని కూడా వారసులకు పంచారు. ఆ క్రమంలోనే ఎర్రగడ్డలోని ఎర్రం నూమా బంగళాకు సంబంధించిన 59 ఎకరాలను సేకరించి ప్రభుత్వ టీబీ ఆస్పత్రి నిర్మించింది. ఇంకా ఆస్తి పంపక వ్యవహారం ఎడతెగని వివాదంగా ఉండడంతో 2022 నవంబరు 29న విశ్రాంత జిల్లా జడ్జి మహమ్మద్‌ నిజాముద్దీన్‌ను చివరిగా రిసీవర్‌ కమ్‌ కమిషనరుగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత ఏడాది మార్చి 16న తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నివేదికపై  అభ్యంతరాలుంటే వ్యక్తం చేయవచ్చని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌కు నోటీసు జారీచేసింది. కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

శ్మశానం తప్ప ఏమీ మిగల్లేదు

రిసీవర్‌ సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆమోదించింది. వాస్తవానికి పంపిణీ చేయడానికి క్షేత్రస్థాయిలో అమీర్‌పేటలోని శ్మశానభూమి మినహా ఇంకేమీ లేదని రిసీవర్‌ నివేదికలో పేర్కొన్నప్పటికీ ఇంకా భూములున్నాయని వాటి భాగ పంపిణీ కాలేదంటూ కొందరు చేసిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. భూమి ఉందని పేర్కొంటున్నపుడు నిర్దిష్ట వివరాలు సమర్పించకుండా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేం. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త కారణాలతో ఇంకా భాగ పంపిణీ జరగాల్సి ఉందని చెప్పజాలరు’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

క్లెయిం తీసుకోనివారు సొమ్ము తీసుకోవచ్చు

భూముల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము 2023 మార్చి 10నాటికి రూ.1,18,81,249 హైకోర్టు వద్ద ఉందని, దాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. తమ వాటాను క్లెయిం చేసుకోని వారు చెక్‌ పిటిషన్‌ దాఖలు చేసి సొమ్మును వడ్డీ సహా తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. అమీర్‌పేటలో ఉన్న శ్మశానవాటికను కేంద్రం చారిత్రక ప్రదేశంగా గుర్తించినందున, ముల్క్‌ వారసులు ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని పరిరక్షించాలని, అంతేగానీ పంపకం జరగడానికి వీల్లేదని తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన 73 ఏళ్ల రికార్డులను భద్రపరచిన హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం అభినందించింది.

పెండింగ్‌లో మరో మూడు పాత కేసులు

తెలంగాణ హైకోర్టులో నిజాం నవాబులు, పైగా భూములకు చెందిన మరో మూడు పాత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వారసుల నుంచి పవర్‌ ఆఫ్‌ అటార్నీతో కొనుగోలు చేశామని, వాటిపై హక్కులున్నాయంటూ పలువురు బడా వ్యక్తులు మధ్యంతర పిటిషన్‌ల మీద పిటిషన్‌లు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళుతున్నారు. అసలైన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా మధ్యంతర పిటిషన్‌లతో వివాదాలు పెరుగుతున్నందున వాటికి తెరదించాలన్న లక్ష్యంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని