మునుపటి పోలింగ్‌ కేంద్రాల్లోనే మీ ఓట్లు

‘లోక్‌సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం.

Published : 28 Apr 2024 03:55 IST

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్‌ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం
ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది నమోదు
‘ఈనాడు’తో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘లోక్‌సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. గత ఏడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవచ్చు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. శనివారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేపడతాం. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 25 నియోజకవర్గాలకు సంబంధించి వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిలో 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించింది. మిగిలిన ఐదింటి విషయంలో స్పష్టత రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ పూర్తి కానుంది. ఆ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీల నుంచి వినతులు వచ్చాయి. వాటిని ఎన్నికల సంఘానికి పంపాం.

మరో 50 కంపెనీల బలగాలను కోరాం

రాష్ట్రానికి 155 కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయి. మరో 50 కంపెనీలను కేటాయించాలని కోరాం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 375 కంపెనీల బలగాలు వచ్చాయి. ఈ దఫా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్‌ జరగనుండటంతో వాటి సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో ఉన్న 60 వేల యూనిఫాం సర్వీసు ఉద్యోగులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 20 వేల పోలీసు బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అక్కడి లోక్‌సభ స్థానాలకు రెండు దశల పోలింగ్‌ పూర్తి అయింది. ఆ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం.

పోస్టల్‌ బ్యాలెట్లు అడిగిన వారు 2.80 లక్షల మంది

లోక్‌సభ ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకునేందుకు నమోదు చేసుకున్నారు. వారిలో 80 శాతం మంది సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు మూడు రోజులు అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతానికి వచ్చే నెల 5, 6, 7 తేదీలని అనుకుంటున్నాం. ఎన్నికల సంఘం అనుమతితో ఆ తేదీలను త్వరలో ఖరారు చేస్తాం. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఫెసిలిటీ సెంటర్‌లో ఓటేయవచ్చు. అందరూ ఒకే రోజు వెళితే ఇతర పనులకు ఇబ్బంది వస్తుంది. అందుకోసమే మూడు రోజుల వ్యవధి నిర్ణయించాం. వారు ఓటు వేసేందుకు ఎంచుకున్న రోజున ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది ఎంచుకున్నారు. వారిలో 11,238 మంది 85 సంవత్సరాలు దాటిన వారు. 11,904 మంది దివ్యాంగులు. 1,832 మంది వివిధ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు.

500 వరకు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు స్పష్టం చేశాం. షామియానాలు వేయాలని చెప్పాం. అందుబాటులో ఉంటే కూలర్లు.. లేని పక్షంలో పెడస్టల్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని తెలిపాం. రాష్ట్రం మొత్తం మీద 500 వరకు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ మోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం’’ అని వికాస్‌రాజ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని