అబ్బే శతఘ్ని గుండ్లు కాదు..శబ్దాలు సృష్టించాం

తమ దేశంపై ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా.. సైన్యం తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తుందని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరించారు.

Published : 08 Jan 2024 05:00 IST

ఆ విషయాన్ని ద.కొరియా కనిపెట్టలేకపోయింది
అంధుల చేతిలో ఆ దేశ భద్రత ఉంది
కిమ్‌ సోదరి యో జోంగ్‌ కవ్వింపు వ్యాఖ్యలు

సియోల్‌: తమ దేశంపై ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా.. సైన్యం తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తుందని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆ దేశ న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ పేర్కొంది. తమ దేశం దిశగా 60 శతఘ్ని గుండ్లను శనివారం ఉ.కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. దీనిపై యో జోంగ్‌ స్పందించారు. ‘‘మరోసారి స్పష్టం చేయదల్చుకొన్నాను. మా సైన్యం ట్రిగ్గర్‌ను ఇప్పటికే అన్‌లాక్‌ చేశాం. చిన్న కవ్వింపు చర్య ఎదురైనా వారు తక్షణమే భారీ స్థాయిలో ప్రతిస్పందిస్తారు. మా సైనికులు సముద్రంలోకి ఒక్క షెల్‌ను ప్రయోగించలేదు. గన్‌పౌడర్‌ను పేల్చి శబ్దాలను సృష్టించాం. ఆ తర్వాత మేము ఊహించినట్లే సియోల్‌ స్పందించింది. శతఘ్ని పేలుళ్లంటూ వారు అబద్ధాన్ని సృష్టించారు. భవిష్యత్తులో ఉత్తర తీరంలో పిడుగులు పడినా.. అది మా సైన్యం పేల్చిన శతఘ్ని గుండు అని చెబుతారు. దక్షిణకొరియా ప్రజలను చూస్తే జాలేస్తుంది. భారీగా పన్నులు చెల్లించి దేశ భద్రతను అంధులకు అప్పగించారు. వీళ్లకు బదులు వాసనను మెరుగ్గా పసిగట్టే కుక్కలకు అప్పగించడం మేలు’’ అని యో జోంగ్‌ వ్యాఖ్యానించారు అంతేకాదు.. దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను మూర్ఖుడైన ధైర్యవంతుడని కిమ్‌ సోదరి అభివర్ణించారు.ఆ దివారం కూడా సరిహద్దుల్లో ఉత్తరకొరియా పేలుళ్ల జరుపుతూ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇవి పశ్చిమ సముద్ర తీరంలో జరిగినట్లు యాంహాప్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించినట్లు తెలిపింది. శుక్రవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని