Joe Biden vs Xi Jinping: బైడెన్‌ వర్సెస్‌ జిన్‌పింగ్‌: ఫోన్‌లోనే అగ్ర దేశాధినేతల వాగ్వాదం

అమెరికా-చైనా అధ్యక్షులు నేరుగా ఫోన్‌లోనే హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. 

Updated : 03 Apr 2024 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాధినేతలు బైడెన్‌, జిన్‌పింగ్‌ ఫోన్‌లోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కాల్‌ ఇరు దేశాల మధ్య సంబంధాల్లో టెన్షన్‌ను మరింత పెంచింది. మరికొన్ని రోజుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు మంత్రులు చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

దాదాపు ఐదు నెలల తర్వాత మంగళవారం అమెరికా, చైనా అధ్యక్షులు తొలిసారి నేరుగా ఫోన్‌కాల్‌లో మాట్లాడుకొన్నారు. ఒక దశలో పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. ఈవిషయాన్ని అమెరికా, చైనా పత్రికలు వెల్లడించాయి. తమ దేశానికి అత్యాధునిక టెక్నాలజీ ఉత్పత్తుల విక్రయంపై బైడెన్‌ సర్కార్‌ విధించిన బ్యాన్‌ ఆర్థిక ముప్పును పెంచుతోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆరోపించారు. ‘‘మా హైటెక్‌ అభివృద్ధిని అణచివేయాలని, బీజింగ్‌కు ఉన్న ఎదిగే హక్కును కాలరాయాలని ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోం’’ అని ఆయన నేరుగా బైడెన్‌ను హెచ్చరించారు. అంతేకాదు.. తైవాన్‌  విషయంలో అమెరికా లక్ష్మణ రేఖను దాటకూడదని తేల్చిచెప్పారు. 

మా భద్రత విషయంలో రాజీలేదు: బైడెన్‌

జిన్‌పింగ్‌ ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా దీటుగా స్పందించారు. ‘అత్యాధునిక టెక్నాలజీని మా దేశ భద్రతకే ముప్పులా మార్చే చర్యలను అడ్డుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటాం. దీనిని ఆపేది లేదు. అనవసరంగా వాణిజ్యం, పెట్టుబడులను పరిమితం చేయకుండా చర్యలు తీసుకొంటాం’’ అని జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పారు. ఇక టిక్‌టాక్‌పై చర్యల విషయంలో తగ్గేది లేదన్నారు. అమెరికన్ల డేటా భద్రతే తమకు ముఖ్యమన్నారు. మే 20వ తేదీన తైవాన్‌ అధ్యక్ష ప్రమాణస్వీకారం ఉండటంతో.. శాంతి, సుస్థిరతలను కాపాడాలని ఆయన జిన్‌పింగ్‌ను కోరినట్లు శ్వేతసౌధం ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. 

భారీ భూకంపం.. ఊగిపోయిన ఫ్లైఓవర్‌

అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్‌ ఎల్లన్‌ నేడు చైనాలోని గ్వాంగ్జూకు వెళ్లనున్నారు. మరికొన్ని వారాల్లో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా బీజింగ్‌లో పర్యటించనున్నారు. మరోవైపు వచ్చే వారం జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా అమెరికాను సందర్శించనున్నారు. ఆ సమయంలో ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడితో కలిసి బైడెన్‌తో త్రైపాక్షిక చర్చలు జరపనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని