JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పరీక్ష రాస్తున్నారా.. ఇవి మరిచిపోవద్దు!

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 పరీక్షకు వేళైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు కీలక సూచనలివిగో..

Updated : 23 Jan 2024 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ మెయిన్‌(JEE main 2024) తొలివిడత పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలు బుధవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ(NTA) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగే JEE Main 2024 Exam కోసం సన్నద్ధమైన విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డు (Admit card)లను https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ (NTA) సూచించింది. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం జరిగే పేపర్‌-2 పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులకు పలు కీలక సూచనలివే..

పరీక్ష కేంద్రంలోకి వెళ్లేటప్పుడు ఇవి మరవొద్దు..

  • విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా తమ అడ్మిట్‌ కార్డును వెంట తీసుకెళ్లాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • ఫొటో ఐడీ: పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను తెలిపే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసుపుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
  • పరీక్ష కేంద్రానికి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. మీరు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను ఎగ్జామ్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఎందుకంటే దాన్ని అటెండెన్స్‌ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది. 
  • విద్యార్థులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్‌ పెన్‌ను తీసుకెళ్లాలి.
  • పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌: దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.
  • పైవాటితో పాటు ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు. మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్‌ టాబ్లెట్స్‌/పండ్లు (అరటిపండు/యాపిల్‌/ఆరంజ్‌) వంటివి తీసుకెళ్లే అవకాశం కల్పించారు.

మరికొన్ని కొన్ని ముఖ్యమైన సూచనలివే..

  • మీ అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన సూచనల్ని క్షుణ్ణంగా చదవండి.
  • పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి. పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని అన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.
  • ట్రాఫిక్‌ జామ్‌, రైలు/బస్సు ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోకపోతే.. అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మీరు మిస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్‌టీఏ బాధ్యత వహించదు. 
  • ఏదైనా సాంకేతిక సాయం/ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్‌ సూపరింటెండెంట్‌ /ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.
  • పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్‌ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్‌ వర్కు చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత రఫ్‌ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
  • పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్‌ను కవర్‌ చేసేందుకు ప్రయత్నించొద్దు. దానివల్ల విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది.
  • పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. 
  • పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే సరిచూసుకొని.. లొకేషన్‌, అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవడం మంచిది.

వీటికి నో ఎంట్రీ.. 

చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్‌ మెటీరియల్‌, వాటర్‌ బాటిళ్లు, మొబైల్‌ఫోన్‌/ఇయర్‌ ఫోన్‌/మైక్రోఫోన్‌/పేజర్‌, కాలిక్యులేటర్‌‌, డాక్యుపెన్‌, కెమెరా, టేప్‌ రికార్డర్‌ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్‌ ఉన్న దుస్తులు వేసుకోరాదు. వీటితో పాటు హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు, నగలు, మెటాలిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. చాక్లెట్లు/క్యాండీ/శాండ్‌విచ్‌ వంటి ప్యాక్‌ చేసిన ఆహారపదార్థాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని