SSC: ఎస్ఎస్సీ కొత్త వెబ్సైట్ ఇదే.. OTR మళ్లీ ఇలా చేసుకోండి!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వెబ్సైట్ లింక్ మారింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇలా ఓటీఆర్ చేసుకోండి.
Staff Selection Commission New portal | దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) వెబ్సైట్ లింక్ను మార్పు చేసింది. గతంలో ఉన్న వెబ్సైట్ యూఆర్ఎల్ స్థానంలో ఇటీవల కొత్త యూఆర్ఎల్ను తీసుకొచ్చింది. దీంతో అభ్యర్థులందరూ కొత్త వెబ్సైట్ https://ssc.gov.in/లో వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR)ను చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పాత వెబ్సైట్ https://ssc.nic.in/లో చేసిన ఓటీఆర్ సమర్పణలు ఇక చెల్లవంది. తాజాగా వచ్చే ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తులు, అడ్మిట్ కార్డులు, పరీక్ష కీ, ఫలితాలు.. ఇలా కేంద్ర ప్రభుత్వ కొలువులకు సంబంధించిన సమస్త సమాచారమంతా కొత్త వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
కొత్త వెబ్సైట్లో ఓటీఆర్ ఇలా..
- తొలుత ssc.gov.in వెబ్సైట్ను సందర్శించాలి.
- లాగిన్/రిజిస్టర్ ఆప్షన్ కనబడుతుంది. అక్కడ రిజిస్టర్పై ఒక విండో ఓపెన్ అవుతుంది.
- ఆ కొత్త విండోలో కిందన రిజిస్టర్ నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే వన్టైం రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డు నంబర్, గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, పదో తరగతిలో చదివిన బోర్డు, రోల్ నంబర్, పాసైన సంవత్సరం, విద్యార్హతలు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలన్నింటినీ నమోదు చేయాలి.
- మీ మొబైల్, ఈ- మెయిల్కు వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకున్నాక సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలను స్టోర్ అవుతాయి.
- ఇతర వివరాలను కూడా ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- తొలిసారి లాగిన్ అయ్యాక.. యూజర్లు తమ పాస్వర్డ్ను మార్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 14 రోజుల లోపే పూర్తి చేయాలి. లేదంటే సేవ్ చేసిన వివరాలు డిలీట్ అవుతాయని గుర్తుంచుకోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.