TS TET: తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) (TS TET)కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

Updated : 10 Apr 2024 12:28 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) (TS TET)కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్‌కు దరఖాస్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతోపాటు గతంలో టెట్‌ పాసైన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు. ఈసారి మాత్రం అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో గడువు పొడిగించినట్లు సమాచారం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని