శెభాష్‌ ఆదిత్య!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘పరీక్షలు పూర్తవ్వగానే కొంతమంది ఏం చేస్తుంటారు?’ - ప్రశ్నపత్రాలను ఎక్కడబడితే అక్కడ విసిరేస్తుంటారు.

Published : 10 Mar 2023 00:58 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘పరీక్షలు పూర్తవ్వగానే కొంతమంది ఏం చేస్తుంటారు?’ - ప్రశ్నపత్రాలను ఎక్కడబడితే అక్కడ విసిరేస్తుంటారు. అది సరే.. మరి ‘విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత నోటు పుస్తకాలను ఏం చేస్తాం?’ - ఆ.. ఏముందీ.. అన్నింటినీ పాతసామగ్రి దుకాణంలో అమ్మడమో, చెత్త బుట్టలో పడేయడమో చేస్తుంటాం. అంతే కదా.. కానీ, ఓ నేస్తం మాత్రం పర్యావరణం కోణంలో భిన్నంగా ఆలోచించాడు. ఆ వివరాలే ఇవీ..

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన ఆదిత్య అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇందుకు కారణం వాళ్ల నాన్న ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్‌ చేస్తూ.. అభినందించడమే. ఇంతకీ విషయం ఏంటంటే.. అన్ని నోటు పుస్తకాల్లో మిగిలిపోయిన తెల్ల కాగితాలను ఒక దగ్గర చేర్చి.. బైండింగ్‌ చేయించి, దాన్ని ఆదిత్య మళ్లీ రఫ్‌ బుక్‌గా ఉపయోగించుకుంటున్నాడట.

పునర్వినియోగం.. ప్రయోజనం

ప్రస్తుతం తొమ్మిదో తరగతి పూర్తి చేసుకొని పదిలోకి అడుగు పెడుతున్న ఆదిత్యకు ఏ వస్తువునైనా వృథాగా పడేయడం ఇష్టం ఉండదట. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యాక.. తన నోటు పుస్తకాల్లో మిగిలిన తెల్ల కాగితాలను తల్లి సహాయంతో చించి, వాటన్నింటినీ ఒకచోటకు చేర్చాడీ నేస్తం. వాటిని బైండింగ్‌ చేయించి, మళ్లీ రఫ్‌ వర్క్‌ కోసం వినియోగిస్తామని చెబుతూ.. వాళ్ల నాన్న ఆ పేపర్ల ఫొటోతో సహా ట్వీట్‌ చేశారు. అది కాస్త.. ప్రధాని మోదీ వరకూ చేరడంతో, బాలుడి ప్రయత్నాన్ని అభినందించారాయన. అంతేకాదు.. రీసైక్లింగ్‌ ద్వారా ‘వేస్ట్‌ టు వెల్త్‌’ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని ఆ కుటుంబం మొత్తాన్ని పొగుడుతూ రీట్వీట్‌ చేశారు. ఏకంగా ప్రధాని నుంచే ప్రశంసలు అంటే మాటలు కాదు కదా.. దాంతో కొద్ది సమయంలోనే ఈ విషయం వైరల్‌గా మారింది.

తల్లి నేర్పిన పాఠం..

ఆదిత్యకు అసలు ఈ అలవాటును తన తల్లి నేర్పించారు. ఆమెకు చిన్నప్పుడు తన అమ్మానాన్నలు ఇలా మిగిలిపోయిన తెల్ల పేజీలను, రఫ్‌ నోట్స్‌గా చేయించి ఇచ్చేవారట. ఆ తర్వాత అదే విషయాన్ని కుమారుడికి చెప్పడంతోపాటు చిన్న తరగతుల నుంచే ఏటా ఈ పాత కాగితాల పునర్వినియోగాన్ని అలవాటు చేశారు. ‘ప్రధానమంత్రి రీట్వీట్‌ నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అది చూశాక చాలా గొప్పగా అనిపించింది. ఏటా విద్యా సంవత్సరం పూర్తి కాగానే, అమ్మతో కలిసి నోట్‌ బుక్స్‌లోని ఖాళీ కాగితాలను వేరు చేసి బైండింగ్‌కి ఇస్తాం. ఆ బుక్‌ని నేను లెక్కల ప్రాక్టీస్‌ కోసమో, రఫ్‌గానో వాడుతుంటా’ అని ఆదిత్య చెబుతున్నాడు. అంతేకాదు నేస్తాలూ.. బడి నుంచి ఇంటికి రాగానే, తన వాటర్‌ బాటిల్‌లో మిగిలిపోయిన నీళ్లను వృథా చేయకుండా, పెరట్లోని మొక్కలకు పోస్తాడట. ఇంటా బయటా ప్లాస్టిక్‌ వాడకం కూడా చాలా తగ్గించామని, వృథా వస్తువులను ఎలా పునర్వినియోగించుకోవాలనే తామంతా ఆలోచిస్తామంటున్నాడు. నేస్తాలూ.. మనలో కూడా చాలామంది ఇలా చేస్తుండొచ్చు.. కానీ, ఇప్పటివరకూ చేయనివాళ్లు మాత్రం ఇకనుంచి ‘వేస్ట్‌ టు వెల్త్‌’ సూత్రాన్ని పాటిద్దామా మరి.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని