తేడా ఏమిటి?

కర్తవ్యం, బాధ్యత- అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు.

Published : 09 Feb 2024 00:32 IST

ర్తవ్యం, బాధ్యత- అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్‌ మెంటు) ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు(అటాచ్‌మెంట్‌) ఉంటుంది. వివేకవంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు. తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీలిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది.

రాముణ్ని ఓ ఇంటివాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. జాగ్ర త్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు. వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్థంతో ముడివడినది. రెండోది- ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ.

విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణమనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం.

సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం. అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్రశస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్‌మెంటు అనే భావానికి అసలైన అర్థం అదే!

రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!

పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిరపడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసాగింపు. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.

ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని