Adani Group: జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరు.. ‘అదానీ’ స్పందనపై హిండెన్‌బర్గ్‌

హిండెన్‌బర్గ్‌ (Hindenburg) నివేదికను ఖండిస్తూ అదానీగ్రూప్‌ నిన్న సుదీర్ఘ స్పందన తెలియజేసింది. ఈ స్పందనకు తాజాగా బదులిచ్చిన హిండెన్‌బర్గ్‌.. అదానీ గ్రూప్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. జాతీయవాదం పేరుచెప్పి మోసాన్ని అస్పష్టంగా ఉంచలేరని దుయ్యబట్టింది.

Updated : 30 Jan 2023 11:52 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తోంది. కాగా.. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని అమెరికా సంస్థపై దుయ్యబట్టింది. అయితే, అదానీ స్పందనను హిండెన్‌బర్గ్‌ తోసిపుచ్చింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ తీవ్ర వ్యాఖ్యలతో బదులిచ్చింది.

అదానీ గ్రూప్ ‌(Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై అదానీ గ్రూప్‌ నిన్న 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది. ‘‘ఇది ఏదో ఒక కంపెనీపై చేసిన దాడి కాదు. భారత్‌, భారత స్వతంత్రత, భారతీయ సంస్థలు, వృద్ధి గాథ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి’’ అని మండిపడింది. అయితే అదానీ గ్రూప్‌ స్పందనకు హిండెన్‌బర్గ్‌ తాజాగా బదులిచ్చింది.

ఇదీ చదవండి: భారత మార్కెట్లను వణికిస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌

‘‘కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూప్‌.. జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోంది. భారత్‌పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్లు ప్రచారం చేస్తోంది. దీన్ని మేం అంగీకరించబోం. భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామ్యమని, ఉత్తేజకరమైన భవిష్యత్తుతో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతోందని మేం విశ్వసిస్తున్నాం. అయితే జాతీయవాదం ముసుగులో దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటున్న అదానీ గ్రూప్‌ దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందనేది కూడా అంతే నిజమని నమ్ముతున్నాం. సంపన్నులైనా.. అనామకులైనా మోసం ఎప్పటికీ మోసమే. జాతీయవాదం పేరు చెప్పి లేదా అస్పష్టమైన స్పందనలతోనో మోసాన్ని దాచి ఉంచలేరు’’ అని హిండెన్‌బర్గ్‌ తీవ్రంగా స్పందించింది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ సమాధానాలు చెప్పలేదని తెలిపింది.

కాపీ పేస్ట్‌ నివేదిక: అదానీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ

మరోవైపు హిండెన్‌బర్గ్‌ నివేదికపై అదానీ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) జుగ్షిందర్‌ సింగ్‌ స్పందించారు. ఎలాంటి పరిశోధనలు లేకుండానే ఆ సంస్థ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. తాము గతంలో ఇచ్చిన సమాచారాన్ని కాపీ చేసి ఆ నివేదిక రూపొందించారని అన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓకు వెళ్లడానికి ముందు ఈ నివేదికను ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని ఆయన ఆరోపించారు.

వినోద్‌ అదానీ కంపెనీ నిధుల గురించి తెలియదట..

‘‘గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, ఆయన విదేశీ డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్‌ బిలియన్ డాలర్ల కొద్దీ అనుమానాస్పద లావాదేవీలు జరుపుతుందని మా నివేదికలో పేర్కొన్నాం. ఆ డొల్ల కంపెనీలతోనే అదానీ గ్రూప్‌.. షేర్లలో అవకతవకలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతోందని మేం సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. వినోద్‌ అదానీ కంపెనీలకు బిలియన డాలర్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించాం. కానీ వీటికి అదానీ గ్రూప్‌ తన 413 పేజీల స్పందనలో జవాబు చెప్పలేదు సరికదా.. వినోద్‌ అదానీకి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేని కారణంగా ఈ కంపెనీ విషయాలను తాము వెల్లడించలేమంటూ బదులివ్వడం ఆశ్చర్యం కలిగించింది. అంతేగాక, వినోద్‌ అదానీ కంపెనీల నిధుల నుంచి తమకు ఏ విషయం తెలియదని చెప్పింది’’ అంటూ హిండెన్‌బర్గ్‌ దుయ్యబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని