Airox Technologies IPO: ఐపీఓ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్న ఎయిరాక్స్‌!

Airox Technologies IPO: ఐపీఓ పత్రాలను ఎయిరాక్స్‌ 2022 సెప్టెంబరు 30న సెబీకి సమర్పించింది. అయితే, ఎలాంటి కారణాలు బహిర్గతం చేయకుండానే వాటిని ఫిబ్రవరి 28న ఉపసంహరించుకుంది.

Published : 06 Mar 2023 18:37 IST

దిల్లీ: వైద్య పరికరాల తయారీ సంస్థ ఎయిరాక్స్‌ టెక్నాలజీస్‌ తమ ఐపీఓ (Airox Technologies IPO) ప్రణాళికలను ఉపసంహరించుకుంది. రూ.750 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం సమర్పించిన ముసాయిదా పత్రాలను సెబీ నుంచి వెనక్కి తీసుకుంది.

పూర్తిగా ఆఫర్‌ సేల్‌ కింద ఐపీఓ (IPO)కి రావాలని ఎయిరాక్స్‌ భావించింది. ప్రమోటర్లు సంజయ్ భరత్‌ కుమార్‌ జైశ్వల్‌, ఆశిమా సంజయ్‌ జైశ్వల్‌ తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించాలనుకున్నారు. ఈ మేరకు ఐపీఓ పత్రాలను 2022 సెప్టెంబరు 30న సెబీకి సమర్పించారు. అయితే, ఎలాంటి కారణాలు బహిర్గతం చేయకుండానే వాటిని ఫిబ్రవరి 28న ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సోమవారం (2023 మార్చి 06న) సెక్యూరిటీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

ఎయిరాక్స్‌ ప్రధానంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటర్లను తయారు చేస్తోంది. పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ మార్కెట్‌లో తమ వాటా 50-55 శాతం వరకు ఉంటుందని కంపెనీ ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. గాలి నుంచి నత్రజని పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంలో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటర్లను వినియోగిస్తారు. ఇతర సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వీటి వల్ల తక్కువ ఖర్చుతో ఆక్సిజన్‌ను సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం భారత్‌లో సగానికి పైగా ఆసుపత్రులు ఆక్సిజన్‌ను సిలిండర్ల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. 2027 నాటికి వాటి స్థానంలో పీఎస్‌ఏ పద్ధతిని ఉపయోగించే అవకాశం ఉందని ఎయిరాక్స్‌ గతంలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని