BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో మరోసారి VRS.. 35% మంది ఉద్యోగులను ఇంటికి పంపే యోచన!

Eenadu icon
By Business News Team Published : 28 Dec 2024 13:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

BSNL | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) తన శ్రామిక శక్తిని తగ్గించి, బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం మరోసారి స్వచ్ఛంద పదవీవిరమణ పథకం (VRS) అమలుచేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదాన్ని కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా 35 శాతం శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తోందని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు వీఆర్‌ఎస్‌ (VRS) ద్వారా టెల్కోలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని డాట్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్‌ఎస్‌ అమలుకు ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి రూ.15 వేల కోట్లను డాట్‌ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థకు వచ్చే ఆదాయంలో రూ.7,500 కోట్లు అంటే దాదాపు 38 శాతం ఉద్యోగుల జీతాల కోసం కేటాయిస్తోంది. ఈ వ్యయాన్ని రూ.5,000 కోట్లకు తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖతో పాటు కేబినెట్‌ ఆమోదం అనంతరం వీఆర్‌ఎస్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

ప్రస్తుతానికి వీఆర్‌ఎస్‌ ప్లాన్‌ ఇంకా అంతర్గత చర్చల్లో ఉందని, ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయంపై టెలికాం అధికారిక ప్రకటన చేయలేదు. 2019లో బీఎస్‌ఎన్‌ఎల్‌, మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌కు (MTNL) రూ.69 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ముందస్తు పదవీ విరమణ అంశం కూడా ఇమిడి ఉంది. ఆ సమయంలో ఈ రెండు టెలికాం సంస్థలకు చెందిన 93 వేల మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. 2022లో రెండోవిడతగా రూ.1.64 లక్షల కోట్లను కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ కింద కేటాయించింది. దిల్లీ, ముంబయి నగరాల్లో ఎంటీఎన్‌ఎల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. ఈ రెండు నగరాలు మినహా దేశమంతటా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు