Jio Cinema: జియో సినిమాకు ఇక డబ్బులు.. ఐపీఎల్‌ మాత్రం ఫ్రీనే!

Jio cinema ready to charge: జియో సినిమాకు ఇకపై డబ్బులు వసూలు చేయాలని రిలయన్స్‌ నిర్ణయిచింది. అయితే, ఐపీఎల్‌ ప్రసారాలు మాత్రం ఉచితంగానే కొనసాగుతాయని కంపెనీ వెల్లడించింది.

Updated : 15 Apr 2023 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌ల ప్రసారాలతో ఆదరణ పొందిన జియో సినిమా (Jio cinema)ను  అతిపెద్ద స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్‌ (Reliance) సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను తన జియో సినిమా యాప్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా నెట్‌ఫ్లిక్స్‌, వాల్ట్‌ డిస్నీ వంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడాలని భావిస్తోంది. అలాగే, కంటెంట్‌కు ఇకపై డబ్బులు వసూలు చేయాలనుకుంటోంది. అయితే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు మాత్రం ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని ప్రకటించింది.

ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న వయాకామ్‌ 18.. జియో సినిమా (Jio cinema) యాప్‌ ద్వారా ఉచితంగా ఐపీఎల్‌ ప్రసారాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. జియో సహా అన్ని టెలికాం నెట్‌వర్క్‌ వినియోగదారులకూ ఉచితంగా సేవలు లభిస్తుండడంతో ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. పాత రికార్డులను తిరగరాస్తోంది. ఐపీఎల్‌ ద్వారా జియో సినిమాకు (Jio cinema) వచ్చిన ఆదరణను కొనసాగించడం కోసం జియో సినిమాలో కొత్తగా కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ (Reliance) అనుకుంటోంది. ఈ విషయాన్ని రిలయన్స్‌ మీడియా, కంటెంట్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి దేశ్‌పాండే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొత్తగా కంటెంట్‌ యాడ్‌ చేశాక.. ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, ఎంత మేర వసూలు చేయాలనేది ఇంత వరకు నిర్ణయించలేదని పేర్కొన్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆలోపే కొత్త కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ భావిస్తోందని జ్యోతి దేశ్‌ పాండే తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను మాత్రం యథాతథంగా ఉచితంగా వీక్షించొచ్చని చెప్పారు. జియో సినిమాకు వసూలు చేసే మొత్తాన్ని అందుబాటు ధరలోనే ఉంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశీయ కంటెంట్‌ను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి వారంలోనే 5.5 బిలియన్‌ యునిక్‌ వ్యూస్‌ను సొంతం చేసుకున్న జియో సినిమా.. ఏప్రిల్‌ 12న జరిగిన చెన్నై- రాజస్థాన్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 22 మిలియన్ల  మంది వీక్షించారని ఆ సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని