SIM dealers: సిమ్‌ డీలర్లకు ఇక పోలీస్‌ వెరిఫికేషన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఇకపై సిమ్‌ డీలర్ల (SIM dealers)కు పోలీసు వెరిఫికేషన్‌ తప్పనిసరి అని కేంద్రం వెల్లడించింది. అంతేగాక, బల్క్‌లో జారీ చేసే సిమ్‌ కార్డులకు కూడా కేవైసీ తప్పనిసరి చేసింది.

Updated : 17 Aug 2023 17:10 IST

దిల్లీ: సైబర్‌ నేరాలు, మోసపూరిత ఫోన్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్‌ కార్డులు విక్రయించే డీలర్ల (SIM dealers)కు మొబైల్ వెరిఫికేషన్‌ (Police verification) తప్పనిసరి చేసింది. అంతేగాక, బల్క్‌ (ఎక్కువ మొత్తంలో) సిమ్‌ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) గురువారం వెల్లడించారు.

‘‘ప్రస్తుతం కొందరు సిమ్‌ డీలర్లు (SIM dealers) అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్‌ ప్రక్రియ లేకుండానే సిమ్‌ కార్డులను విక్రయిస్తున్నారు. ఇకనుంచి అలాంటివి ఉండవు. సిమ్‌ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తున్నాం. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10లక్షల జరిమానా విధించనున్నాం’’ అని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10లక్షల సిమ్‌ డీలర్లు ఉన్నారని, వారంతా పోలీసు వెరిఫికేషన్‌ పూర్తి చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు.

మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కారణమిదే..!

దీంతో పాటు బల్క్‌ కనెక్షన్ల (bulk connections) నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దాని స్థానంలో బిజినెస్‌ కనెక్షన్ల (business connection) పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ మధ్య మోసగాళ్లు 5 సిమ్‌లను తీసుకుని వాటిని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత వాటిని డియాక్టివేట్‌ చేసి మరో బ్యాచ్‌ సిమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి నేరాలను అధ్యయనం చేసిన తర్వాత బల్క్‌ కనెక్షన్ల విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాం’’ అని కేంద్రమంత్రి ప్రకటించారు.

ఇకపై బిజినెస్‌ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇందులో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ‘‘ఉదాహరణకు ఒక కంపెనీ 4వేల సిమ్‌ కార్డులను తీసుకుందనుకోండి. గతంలో కంపెనీ కేవైసీని మాత్రమే వెరిఫై చేసి ఈ సిమ్‌లను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ నాలుగువేల ఉద్యోగుల కేవీసీలను చేసిన తర్వాత సిమ్‌కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది’’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు 52 లక్షల మొబైల్‌ కనెక్షన్లను తొలగించామని కేంద్రమంత్రి వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్న 67వేల డీలర్లను బ్లాక్‌ చేశామని, సిమ్‌ డీలర్లపై 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సప్‌ ఖాతాలను కూడా బ్లాక్‌ చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని