SBI Report: 2047 నాటికి ₹15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్‌బీఐ రీసెర్చ్‌

SBI Research Report: 2047 నాటికి దేశ తలసరి ఆదాయం గణనీయంగా పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు సైతం పెరగనున్నారని పేర్కొంది.

Updated : 15 Aug 2023 14:07 IST

దిల్లీ: శత స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం (per capita income) గణనీయంగా పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి (SBI report) పేర్కొంది. 2047 నాటికి తలసరి ఆదాయం ఇప్పుడున్న (2022-23 ఆర్థిక సంవత్సరం) రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరగనుందని పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశమనేది స్వప్నం కాకూడదని.. 140 కోట్ల పౌరుల ప్రతిజ్ఞ కావాలని ఆకాక్షించారు.

త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక.. తలసరి ఆదాయంతో పాటు మరికొన్ని గణాంకాలను తన నివేదికలో బయటపెట్టింది. 2021-22లో పన్ను చెల్లింపుదారుల సగటు ఆదాయం రూ.13 లక్షలుగా ఉండగా... 2047 నాటికి ఆ మొత్తం 49.9 లక్షలకు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి ఆర్థిక వేత్తలు తెలిపారు. తక్కువ ఆదాయ వర్గాలు కాస్త అధికాదాయ వర్గాలుగా మారనున్నారని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య సైతం ప్రస్తుతం ఉన్న ఎనిమిదిన్నర కోట్ల నుంచి 48.2 కోట్లకు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే శ్రామిక శక్తి 2022-23లో 22.4 శాతం కాగా.. 2047 నాటికి 85.3 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. జీరో ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య మరో 25 శాతం మేర తగ్గనుందని అంచనా కట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని