Union Budget 2024: 57 నిమిషాల మధ్యంతర బడ్జెట్‌.. నిర్మలమ్మ ప్రసంగాల్లో ఇదే అతి చిన్నది!

Union Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటివరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం మాట్లాడారు.

Updated : 09 Jul 2024 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్‌ (Union Budget 2024)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రజల ముందు ఉంచారు. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి.  అయితే, గతంతో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు.

నిర్మలమ్మ ప్రసంగాల్లో ఇదే చిన్నది..

నిర్మలా సీతారామన్‌ ఇప్పటివరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం మాట్లాడారు. ఈసారి ఆమె దేశ పద్దును 57 నిమిషాల్లో లోక్‌సభ వేదికగా దేశ ప్రజలకు వినిపించారు.

కొత్త హౌసింగ్‌ స్కీమ్‌.. 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

గతంలో 2 గంటల పైనే..

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం (Budget Speech) చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) పాటు ప్రసంగించారామె. అప్పుడు ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలిఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది.

ఇక, 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతి పెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. గతేడాది నిర్మలమ్మ 86 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం వినిపించారు.

మొరార్జీ దేశాయ్‌ తర్వాత ఆరోసారి..

2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. పూర్తిస్థాయి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇక, మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ మరో రికార్డు నెలకొల్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని