IPOs: వచ్చేవారం దలాల్‌ స్ట్రీట్‌ బిజీ బిజీ.. 6 ఐపీఓలు.. 5 లిస్టింగ్‌లు

IPOs: వచ్చే వారం రోజుల్లో మొత్తం ఆరు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.

Published : 25 Feb 2024 17:57 IST

IPO | ముంబయి: వచ్చేవారం ఆరు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. రూ.3,300 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మూడు మెయిర్‌బోర్డ్‌ విభాగంలో కాగా.. మరో మూడు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో వస్తున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. మొత్తంగా వచ్చే వారం దలాల్‌ స్ట్రీట్‌లో సందడి వాతావరణం నెలకొననుంది.

ప్లాటినం ఇండస్ట్రీస్‌ ఐపీఓ..

స్టెబిలైజర్ల తయారీ కంపెనీ ప్లాటినం ఇండస్ట్రీస్‌ ఐపీఓ ఫిబ్రవరి 27-29 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.162-171గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.235.32 కోట్లు సమీకరించనుంది. మొత్తం కొత్త షేర్లను మాత్రమే ఐపీఓలో అందుబాటులో ఉన్నాయి.

ఎగ్జికామ్‌ టెలీ-సిస్టమ్స్‌ ఐపీఓ..

విద్యుత్‌ వాహనాలకు ఛార్జింగ్‌ వసతులను అందించే ఎగ్జికామ్‌ టెలీ-సిస్టమ్స్‌ రూ.429 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఫిబ్రవరి 27-29 మధ్య షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.135- 142గా నిర్ణయించారు. ఈవీ ఛార్జింగ్‌ విభాగంలో ఐపీఓకి వస్తున్న తొలి కంపెనీ ఇదే. రూ.329 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.100 కోట్లు విలువ చేసే వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు.

భారత్‌ హైవేస్‌ ఇన్విట్‌ ఐపీఓ..

వచ్చేవారం మెయిన్‌బోర్డు సెగ్మెంట్‌లో భారత్‌ హైవేస్‌ ఇన్విట్‌ ఐపీఓ చివరిది. రూ.2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇది పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఫిబ్రవరి 28 ప్రారంభమై మార్చి 1న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.98-100గా నిర్ణయించారు.

ఒవైస్‌ మెటల్‌ అండ్‌ మినరల్‌ ప్రాసెసింగ్‌ ఐపీఓ..

వచ్చేవారం ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో వస్తున్న తొలి ఐపీఓ ఒవైస్ మెటల్ అండ్‌ మినరల్ ప్రాసెసింగ్. ఫిబ్రవరి 26-28 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.83-87. గరిష్ఠ ధర వద్ద రూ.42.7 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు.

పూర్వ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఐపీఓ..

ప్యాకేజింగ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ పూర్వ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఐపీఓ ఫిబ్రవరి 27-29 మధ్య జరగనుంది. ధరల శ్రేణిని రూ.70-71గా నిర్ణయించారు. రూ.40.2 కోట్లు సమీకరించనున్నారు. కేవలం కొత్త షేర్లను మాత్రమే ఈ ఇష్యూలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లు లేవు.

ఎంవీకే అగ్రో ఫుడ్‌ ప్రోడక్ట్‌ ఐపీఓ..

ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో రానున్న చివరి ఐపీఓ ఎంవీకే అగ్రో ఫుడ్‌ ప్రోడక్ట్‌. రూ.65.88 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఒక్కో షేరుకు రూ.120 ధరను నిర్ణయించింది. మొత్తం రూ.65.88 కోట్లు సమీకరించనుంది.

మరోవైపు రూ.525 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రారంభమైన జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓ ఫిబ్రవరి 26న ముగియనుంది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో సాధవ్‌ షిప్పింగ్‌ ఇష్యూ ఫిబ్రవరి 27తో ముగుస్తోంది.

లిస్టింగ్‌లివే..

సరఫ్‌ హోటల్స్‌, హయత్‌ హోటల్స్‌ యాజమాన్యంలోని జునిపర్‌ హోటల్స్‌ షేర్లు ఫిబ్రవరి 28న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. రూ.1,800 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చిన ఈ సంస్థ షేర్లకు ఐపీఓలో 2.08 రెట్ల స్పందన లభించింది. మరోవైపు జీపీటీ హెల్త్‌కేర్‌ షేర్లు 29న ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. రెండో రోజు ముగిసే సమయానికి ఈ ఐపీఓకు 85 శాతం షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో జెనిత్‌ డ్రగ్స్‌, డీమ్‌ రోల్ టెక్‌ షేర్లు ఫిబ్రవరి 27న, సాధవ్‌ షిప్పింగ్‌ మార్చి 1న లిస్ట్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని