Tesla: ఆటోపైలట్‌ తప్పిదంతో ప్రమాదం.. టెస్లాకు రూ.2,100కోట్ల జరిమానా

Eenadu icon
By Business News Team Updated : 02 Aug 2025 09:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్‌ ఆటోమొబైల్‌ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019 నాటి రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటో పైలట్‌ వ్యవస్థ తప్పిదమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్దరించింది. దీంతో బాధితులకు 242 మిలియన్‌ డాలర్ల పరిహారం (భారత కరెన్సీలో దాదాపు రూ.2,100కోట్లు) చెల్లించాలని కంపెనీని (Tesla) ఆదేశించింది. నాటి ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డారు.

2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో ఈ ఘటన (Fatal Autopilot crash) చోటుచేసుకుంది. జార్జ్‌ మెక్‌గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళ్తూ అధునాతన ఆటోపైలట్‌ ఫీచర్‌ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ వ్యవస్థ. మార్గమధ్యలో తన మొబైల్‌ ఫోన్‌ కారులో కింద పడిపోయింది. ఎలాగూ కారు ఆటోపైలట్‌ మోడ్‌లోనే ఉందని భావించిన జార్జ్‌.. కిందకు వంగి ఫోన్‌ తీసుకునేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో కారు అదుపుతప్పి పక్కనే పార్క్‌ చేసి ఉన్న ఓ కారును ఢీకొట్టి ఇద్దరు వ్యక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతకు యువతి మృతదేహం 75 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ ప్రమాదానికి గానూ బాధితుల కుటుంబాలకు 329 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆటోపైలట్‌ వ్యవస్థ తప్పిదం కూడా ప్రమాదానికి ఓ కారణమేనని గుర్తించిన కోర్టు.. ఇందుకు గానూ పరిహారంలో మూడోవంతు అంటే దాదాపు 242 మిలియన్‌ డాలర్లు టెస్లా కంపెనీ చెల్లించాలని ఆదేశించింది. మిగతా మొత్తం సదరు వాహన డ్రైవర్‌ ఇవ్వాలని స్పష్టంచేసింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్‌ చేయనున్నట్లు టెస్లా తెలిపింది.

Tags :
Published : 02 Aug 2025 09:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని