Tesla: జులై 15న భారత్‌లో టెస్లా షోరూం ప్రారంభం!

Eenadu icon
By Business News Team Published : 11 Jul 2025 10:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Tesla entry to India | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించడం ఖరారైంది. భారత్‌లో తమ కార్ల విక్రయాలు ప్రారంభించడానికి మస్క్‌ కంపెనీ జులై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇందుకోసం ఇప్పటికే 5 వై మోడల్‌ కార్లు ముంబయికి చేరుకున్నట్లుగా జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. చైనాలోని షాంఘై నుంచి వాటిని తీసుకొచ్చినట్లు సమాచారం. అనంతరం దిల్లీలోనూ మరో షోరూం ఏర్పాటుచేయడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్‌ కంపెనీ డిమాండ్‌ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న షరతు పెట్టింది. ఇందుకు మస్క్‌ అభ్యంతరం వ్యక్తంచేయడంతో టెస్లా (Tesla cars) ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది.

ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మస్క్‌ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుంకాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 40వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.34లక్షలు) కంటే ఎక్కువ ఖరీదైన హైఎండ్‌ కార్లపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని భారత్‌ తగ్గించింది. దీంతో భారత్‌లో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమయ్యింది. అయితే విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో షోరూమ్‌లు ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. దేశీయంగా కార్ల తయారీకి సుముఖంగా లేదని ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు