UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్‌?

UCO bank Funds: యూకో బ్యాంక్‌ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది.

Published : 07 Dec 2023 02:06 IST

UCO bank | దిల్లీ: యూకో బ్యాంక్‌ కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి అనూహ్యంగా డబ్బులు జమ అయిన ఘటనలో సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. రూ.820 కోట్లు పొరపాటున బదిలీ ఘటనలో.. సరిగ్గా అవే తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు ఆ సంస్థ దృష్టి సారించింది. నవంబర్‌ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మంది కస్టమర్ల ఖాతాల్లో పొరపాటున డబ్బులు జమ అయిన సంగతి తెలిసిందే. బదిలీ చేసిన ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ కట్‌ అవ్వకుండానే యూకో బ్యాంక్‌ ఖాతాదారుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. దీనిపై బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ప్రస్తుతం దీనిపై కూపీ లాగుతోంది.

బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై సీబీఐ అనుమానం వ్యక్తంచేస్తోంది. లావాదేవీలు జరిగిన తేదీల్లోనే ఆయా ఖాతాలు ఎలా తెరుచుకున్నాయనే దానిపై ఇప్పుడు సీబీఐ ఆరా తీస్తోంది. పొరపాటున జమ అయిన మొత్తాలను చాలా మంది ఇదే అదునుగా విత్‌డ్రా చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. నేరపూరిత ఉద్దేశంతో ఎవరెవరైతే డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నారో వారు తమ దర్యాప్తు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీఐ పేర్కొంది. మోసపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించి లబ్ధి పొందిన వారిపైనే తాము దృష్టి సారించామని స్పష్టంచేసింది.

రూ.820 కోట్ల IMPS లావాదేవీలు.. 13చోట్ల సీబీఐ సోదాలు

ఇదే అదునుగా కొందరు నేరగాళ్లు దర్యాప్తు అధికారులమంటూ ఖాతాదారుల్ని మోసగించే అవకాశం ఉందని సీబీఐ అప్రమత్తం చేసింది. కేసుకు సంబంధించిన వివరాల కోసం సీబీఐ ఏ ఒక్కరికీ ఫోన్‌ కాల్స్‌ చేయబోదని, ఒకవేళ ఎవరైనా అలా కాల్‌ చేస్తే సీబీఐని సంప్రదించాలని సూచించింది. రాజస్థాన్‌లో అత్యధికంగా 230 శాఖల పరిధిలో 28వేల ఖాతాలకు 7.50 లక్షల లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఆయా లావాదేవీల రూపంలో మొత్తం రూ.760 కోట్లు జమ అయ్యింది. అలాగే, కర్ణాటకలో రూ.3.40 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ రూ.2.60 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంక్‌ ఇద్దరు సపోర్ట్‌ ఇంజినీర్లు, గుర్తు తెలీని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇటీవల వివిధ చోట్ల జరిపిన సోదాల్లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వంటి ఎలక్ట్రానిక్‌ ఆధారాలను సీబీఐ సేకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని