Tariffs Effect: అదనపు సుంకాల ఎఫెక్ట్.. ఐఫోన్లపై లేనట్లేనా!

Eenadu icon
By Business News Team Published : 27 Aug 2025 00:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా దిగుమతి చేసుకొనే భారత వస్తువులపై ఇప్పటికే 25శాతం సుంకాలు (US Tariffs) విధించగా.. మరో 25శాతం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ అమెరికాలో యాపిల్‌ ఐఫోన్ల (iPhone)పై ఈ సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. సెమీకండక్టర్‌ ఆధారిత వస్తువులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయిస్తూ గతంలో అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. దీంతో సుంకాల నుంచి యాపిల్‌ (Apple)కు ప్రస్తుతానికి ఉపశమనంగానే ఉన్నప్పటికీ.. ఇది తాత్కాలికమేనని నిపుణుల అంచనా.

ఆయా సంస్థలు తమ తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని స్పష్టం చేస్తున్న ట్రంప్‌.. కొన్ని రంగాలకు ఇందుకు కొంత గడువు ఇచ్చారు. ముఖ్యంగా సెమీకండక్టర్‌ సంబంధిత వస్తువులకు మినహాయింపు ఇస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఇవే తాజా సుంకాల ప్రభావం నుంచి యాపిల్‌ ఉత్పత్తులకు ఉపశమనం కలిగిస్తోంది. అయితే, ఇది తాత్కాలికమేనని.. వీటి నుంచి ఎవ్వరూ బయటపడరని ట్రంప్‌ యంత్రాంగం గతంలో స్పష్టం చేసింది. వీటిపై తాజాగా అమెరికా వాణిజ్య శాఖ సమీక్ష చేస్తోందని, ఒకవేళ మినహాయింపు ఉపసంహరించుకుంటే మాత్రం యాపిల్‌ సహా అనేక ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ల తయారీకి ప్రధాన కేంద్రంగా మొన్నటివరకు చైనా ఉండగా, ట్రంప్‌ సుంకాల విధింపుతో టెక్‌ దిగ్గజం భారత్‌ను ఎంచుకుంది. అనంతరం భారత్‌లో తయారు చేసే ఉత్పత్తులను భారీ స్థాయిలో ఎగుమతి చేస్తోంది. ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో అమెరికాలో అమ్ముడైన 71శాతం ఐఫోన్లు భారత్‌లో తయారైనవేనని ఓ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇది 31శాతంగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల భారత్‌పైనా ట్రంప్‌ సుంకాల మోత మోగించడంతో ఆందోళన మొదలైంది. అయినప్పటికీ.. యాపిల్‌ మాత్రం ముందస్తు ప్రణాళిక ప్రకారం భారత్‌లో వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది.

ఇదిలాఉంటే, గతంలో విధించిన 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా.. అదనంగా విధించిన 25శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు